కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి ఘట్టమైన చక్రస్నానాన్ని గురువారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో సుదర్శన చక్రత్తాళ్వార్కు పవిత్ర స్నానం చేయించగా, వేలాది మంది భక్తులు ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. దీంతో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ఉత్సవాలకు పరిసమాప్తి పలికినట్లయింది.ఈ బ్రహ్మోత్సవాలు అసాధారణ రీతిలో విజయవంతమయ్యాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ చేసిన ఏర్పాట్లపై దేశవ్యాప్తంగా భక్తులు ప్రశంసలు కురిపించారని, వారి సంతృప్తే ఈ ఉత్సవాల విజయానికి గీటురాయి అని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా మొత్తం 5.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వెల్లడించారు. శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 25.12 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.భక్తుల సేవలోనూ టీటీడీ తన ప్రత్యేకతను చాటుకుంది. ఉత్సవాల సమయంలో ఏకంగా 26 లక్షల మంది భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందించారు. మరోవైపు, 28 లక్షలకు పైగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేశారు. అలాగే, 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు ఛైర్మన్ వివరించారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున అదనంగా 45,000 మందికి దర్శన భాగ్యం కల్పించడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa