ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగో సంతానంతో ఉద్యోగ గండం.. బిడ్డను అడవిలో పారేసిన ప్రభుత్వ టీచర్

national |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 07:17 PM

పురిట్లో బిడ్డను తల్లిదండ్రులే అడవిలో పడేశారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ శిశువును అడవి తల్లి అక్కున చేర్చుకుంది. జీవితపు మొదటి గంటల్లో అతడికి తోడుగా ఉన్నవి చర్మంపై పాకిన చీమలే. అత్యంత అమానుష ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో వెలుగుచూసింది. ఒక రాత్రంతా ఆ చిన్నారి చలిలో, చీమ కాట్లతో, ఊపిరి ఆడని పరిస్థితిలో రాయి కింద గడిపాడు. కానీ, ఉదయం వేళ ఏడుపులు విన్న కొందరు. ఓ రాయిని తొలగించగా, రక్తమోడుతూ వణుకుతున్న ప్రాణాలతో ఉన్న శిశువు కంటబడ్డాడు. అయితే, తన ఉద్యోగం పోతుందనే ప్రభుత్వ టీచర్ తన భార్యతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు


పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఛింద్వారా జిల్లాకు చెందిన బబ్లూ దండోలియా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తన భార్య రాజకుమారి దండోలియాతో కలిసి శిశువును అడవిలో పడేశారు. ఇది వారికి నాలుగో సంతానం కావడంతో బిడ్డను వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండగా, ‘ఇద్దరికి మించి పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు’ అన్న నియమం కారణంగా భయం పట్టుకుంది. రాజకుమారి గర్భం దాల్చిన విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టింది.


సెప్టెంబర్ 23 తెల్లవారుజామున ఇంట్లోనే బిడ్డను ప్రసవింంచగా.. కొన్ని గంటల్లోనే బిడ్డను అడవిలోకి తీసుకెళ్లి రాయి కింద ఉంచారు. మార్నింగ్ వాకర్లు శిశువు ఏడుపు విన్నారు. అయితే, ఏదో జంతువు అనుకున్నామని, దగ్గరగా వెళ్లి చూడగా, రాయి కింద చిన్నచిన్న చేతులు కదులుతున్నాయని ఓ గ్రామస్థుడు తెలిపారు. ఇలాంటి పని ఏ తల్లిదండ్రులు చేయకూడదని మండిపడ్డాడు.


అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చిన శిశువును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఛింద్వారా జిల్లా ఆసుపత్రి వైద్యులు శరీరంపై చీమ కాట్లు ఉన్నాయని, హైపోథర్మియా లక్షణాలు ఉన్నాయని నిర్ధారించారు. ‘ఈ పరిస్థితిలో ఒక రాత్రంతా బతకడం అనేది అద్భుతమే,’ అని తెలిపారు. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఆ శిశువు సురక్షితంగా ఉన్నాడు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ... సీనియర్ అధికారులతో మేము చర్చిస్తున్నామని, BNS 1019 (హత్యాయత్నం) కింద కూడా కేసు నమోదు చేసే అవకాశముందని అన్నారు. కాగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. భారత్‌లో వదిలేసిన శిశుమరణాలు మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువ జరుగుతున్నాయి. పేదరికం, సామాజిక కట్టుబాట్లు, ఉద్యోగ సంబంధిత భయాలు ఈ ఘటనలకు కారణం అవుతున్నాయి. అయితే ఈ ఘటన అత్యంత భయంకరమైంది. ఎందుకంటే ఇది పేదరికం వల్ల కాదు, చదువుకున్న కుటుంబం బాధ్యతను తప్పించుకోవడానికే ఈ మార్గాన్ని ఎంచుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa