ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకం తీసుకువచ్చింది. స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆటో డ్రైవర్లు గిరాకీ కోల్పోయి, వారి ఉపాధికి ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో రూ.15000 ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.15000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ సింగ్నగర్లోని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద అర్హులైన 2.90 లక్షల మంది డ్రైవర్లకు.. రూ.436 కోట్ల మేరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
మరోవైపు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కోసం ప్రభుత్వం అనేక మార్గదర్శకాలు, విధి విధానాలు రూపొందించింది. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆటో డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే వాహనం రిజిస్ట్రేషన్ ఏపీలో జరిగి ఉండాలి. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లకు ఈ పథకం లబ్ధి అందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
లైసెన్స్ లేని ఆటో డ్రైవర్లు లైసెన్స్ పొందేందుకు సహాయం అందించాలని నిర్ణయించారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆటో డ్రైవర్లు లైసెన్స్కు దరఖాస్తు చేసుకునేందుకు సహాయం అందిస్తామని జీవీ ఆంజనేయులు శనివారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆటో డ్రైవర్లు అందరూ లైసెన్సులు పొందగలుగుతారని.. తద్వారా ఆటో డ్రైవర్ల సేవలో పథకం లబ్ధి కూడా పొందుతుందని ఆంజనేయులు భావిస్తున్నారు.
మరోవైపు జీవీ ఆంజనేయులు శివశక్తి ఫౌండేషన్ ద్వారా గడిచిన రెండు దశాబ్దాలకు పైగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగించారు. తాజాగా ఆటో డ్రైవర్లకు కూడా అండగా నిలవాలనే ఉద్దేశంతో లైసెన్సుల దరఖాస్తు సమయంలో సహాయం చేయాలని నిర్ణయించారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు ఏటా పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.15000లకు పెంచింది. అలాగే వాహన మిత్ర పేరును ఆటో డ్రైవర్ల సేవలో అంటూ మార్చి అమలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa