గుంటూరులో ఇటీవల జరిగిన పరువు హత్య కేసు సంచలనం రేపుతోంది. ఈ దారుణానికి దారితీసిన అంశాలపై ఇప్పుడు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న గణేశ్ (మృతుడు) ను యువతి సోదరుడు దుర్గారావు అతి కిరాతకంగా హత్య చేశాడు. కేవలం ప్రేమను అంగీకరించకపోవడం మాత్రమే కాక, అంతకుముందు జరిగిన పెళ్లి చూపుల ఘట్టమే ఈ పగకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
గణేశ్కు, సమీప బంధువు అయిన అంజనీ దేవికి గతంలో పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరిగాయి. అయితే, ఆ సమయంలో గణేశ్ పొట్టిగా ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో అంజనీ దేవి తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని నిరాకరించారు. దీనిపై గణేశ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అయినప్పటికీ, పెళ్లి చూపుల సందర్భంగా పరస్పరం ఫోన్ నంబర్లు మార్చుకున్న గణేశ్, అంజనీ దేవి ఆ తర్వాత రహస్యంగా ప్రేమించుకోవడం మొదలుపెట్టారు.
కుటుంబం అంగీకారం లేకపోవడంతో, ఆ ప్రేమికులు పది రోజుల క్రితం ఇంట్లోంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ విషయం అంజనీ దేవి సోదరుడు దుర్గారావుకు మరింత కోపాన్ని తెప్పించింది. తన చెల్లెలికి పెళ్లి చూపుల సమయంలో తిరస్కరణకు గురైన వ్యక్తితో, పైగా తాను పొట్టిగా ఉన్నాడని నిర్మొహమాటంగా చెప్పినా, మాయమాటలు చెప్పి తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడనే కసి దుర్గారావులో పెరిగింది. ఈ అవమానం, కోపం కలిసి అతణ్ణి హంతకుడిగా మార్చాయి.
ప్రేమను దక్కించుకున్న ఆనందం ఎక్కువ కాలం నిలవకముందే, పగతో రగిలిపోయిన దుర్గారావు... గణేశ్ను దారుణంగా హత్య చేసి తన పరువును నిలబెట్టుకోవాలని చూశాడు. కానీ, ఈ చర్యతో అతడు కటకటాల పాలయ్యాడు. ఒకప్పుడు పెళ్లి చూపుల్లో తిరస్కరణకు గురైన ఎత్తు అనే అంశమే, ఈ ప్రేమ జంట జీవితాల్లో విషాదకరమైన మలుపుకు, చివరకు పరువు హత్యకు కారణం కావడం విచారకరం. పోలీసులు కేసు నమోదు చేసి దుర్గారావుపై కఠిన చర్యలకు ఉపక్రమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa