పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో గతేడాది ఓ మెడికల్ స్టూడెంట్పై జరిగిన అత్యాచారం, హత్య కేసును ఇంకా దేశం మర్చిపోకముందే.. అదే రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా పశ్చిమ బెంగాల్లోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన దుర్గాపూర్ సమీపంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రాంగణంలోనే ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. మెడికల్ కాలేజీ నుంచి బయటికి వచ్చి.. పానీపూరీ తినేందుకు వెళ్లిన ఆ మెడికల్ స్టూడెంట్ను చూసిన నిందితుడు.. ఆమెను బలవంతంగా ఏకాంత ప్రదేశానికి బలవంతంగా లాక్కెళ్లి మరీ.. అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనకు కారణం అవుతోంది.
ఒడిశాలోని జలేశ్వర్కు చెందిన ఆ మెడికల్ విద్యార్థిని దుర్గాపూర్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆమె తన స్నేహితుడితో కలిసి మెడికల్ కాలేజీ క్యాంపస్ గేటు బయటికి వచ్చింది. అప్పుడే ఒక వ్యక్తి ఆమెను బలవంతంగా ఆస్పత్రి వెనుక ఉన్న ఏకాంత ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనకు సంబంధంచిన సమాచారం.. తన కుమార్తె స్నేహితుడి ద్వారా తెలిసిందని బాధితురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు. తాను అక్కడికి చేరుకునే సరికే తన కుమార్తె చాలా సీరియస్ కండిషన్లో ఉందని.. ఆస్పత్రి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆరోపించారు. తన కుమార్తెను ఆమె ఫ్రెండ్ వాసిఫ్ అలీ కలవడానికి పిలవడంతోనే ఆమె పానీపూరీ తినడానికి బయటికి వెళ్లిందని తండ్రి తెలిపారు.
ఆమె క్యాంపస్ గేటు వద్దకు చేరుకోగానే.. అక్కడ నాలుగురైదుగురు వ్యక్తులు ఉన్నారని.. వారిలో ఒకరు తన కుమార్తెపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత ఆమె సెల్ఫోన్ను లాక్కుని.. తిరిగి ఇచ్చేందుకు రూ.3 వేలు డిమాండ్ చేసినట్లు బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత.. ఆమె ఫ్రెండ్ తనను వెనక్కి తీసుకొచ్చాడని వివరించారు. తన కూతురిని డాక్టర్ చేయాలనే కలతో ఈ కాలేజీలో చేర్పించినట్లు చెప్పారు. తన కుమార్తెకు న్యాయం జరగాలని.. ఇలాంటి పరిస్థితి ఏ ఇతర అమ్మాయికి జరగకూడదని అన్నారు. ఆ మెడికల్ కాలేజీ క్యాంపస్లో సరైన సెక్యూరిటీ లేదని... అని కాలేజీ భద్రతా లోపాలను ఎత్తి చూపారు.
ఇక ఈ అత్యాచార ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును మొదలుపెట్టారు. బాధితురాలికి మెడికల్ టెస్ట్ల కోసం ఆస్పత్రిలో చేర్పించారు. విచారణలో భాగంగా మెడికల్ కాలేజీ సిబ్బందిని, ఆమెతో పాటు వెళ్లిన ఫ్రెండ్ను, ఇతర అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసుపై పోలీసులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
బెంగాల్లో మహిళలపై నేరాలు, మమతా బెనర్జీ సర్కారుపై విమర్శలు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలు, నేరాల నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. తాజాగా ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం పెను దుమారానికి కారణం అవుతోంది. ఈ ఏడాది జులై నెలలో కస్బాలోని సౌత్ కోల్కతా లా కాలేజీ ప్రాంగణంలో ఒక న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆ నగరంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.
ఇక 2024లో పశ్చిమ బెంగాల్లోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలకు కారణం అయిన కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఘటన అందరికీ తెలిసిందే. 26 ఏళ్ల పీజీ మెడికల్ డాక్టర్పై నిందితుడు అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేయడం సంచలనం రేపింది. ఇలాంటి దారుణ ఘటనలు, పని ప్రదేశాల్లో, విద్యాసంస్థల్లో మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వారాల తరబడి నిరసనలు వెల్లువెత్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa