కేదార్నాథ్ ధామ్ దర్శనానికి వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం అదానీ గ్రూప్ ఒక భారీ రోప్వే నిర్మాణాన్ని చేపడుతోందని ఆ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం ప్రకటించారు. ఈ రోప్వే అందుబాటులోకి వస్తే.. కష్టతరమైన పుణ్యక్షేత్ర యాత్ర మరింత సులభంగా, సురక్షితంగా మారుతుందని ఆయన తెలిపారు. సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ను కలుపుతూ నిర్మించనున్న ఈ రోప్వే ప్రాజెక్టుకు మొత్తం రూ. 4,081 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం 9 గంటలపాటు కష్టపడి చేయాల్సిన కాలి నడక ప్రయాణ సమయాన్ని.. ఈ రోప్ వే కేవలం 36 నిమిషాలకు తగ్గిస్తుంది. మొత్తంగా ఇది 12.9 కిలో మీటర్ల దూరం ఉండగా.. అరగంటలోనే అక్కడకు చేరుకోవచ్చు.
"కేదార్నాథ్ ధామ్కు వెళ్లే కఠినమైన అధిరోహణ ఇప్పుడు సులభమవుతుంది. భక్తుల పుణ్యయాత్రను మరింత సరళంగా, సురక్షితంగా మార్చడానికి అదానీ గ్రూప్ ఈ రోప్వేను నిర్మిస్తోంది" అని గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ పవిత్రమైన ప్రయత్నంలో పాలుపంచుకోవడం మాకు గర్వకారణంగా ఉందని తెలిపారు. ఆ మహాదేవుని దయ అందరిపై ఉండాలని కోరుకుంటున్నని చెప్పారు. చివరలో జై బాబా.. జై కేదార్నాథ్ అని ఆయన రాసుకొచ్చారు.
ఆరు సంవత్సరాల్లో నిర్మాణం..
అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) రోడ్స్, మెట్రో, రైల్, వాటర్ విభాగం ద్వారా ఈ ప్రతిష్టాత్మక రోప్వే ప్రాజెక్టును అమలు చేయనున్నారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ నుంచి ఈ నిర్మాణానికి సంబంధించి ఏఈఎల్ సెప్టెంబర్లో లెటర్ ఆఫ్ అవార్డును అందుకుంది. అదానీ సంస్థ చేపడుతున్న మొట్టమొదటి రోప్వే ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఈ ప్రాజెక్టును ఆరు సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఏఈఎల్ ఈ రోప్వేను 29 సంవత్సరాలపాటు నిర్వహించనుంది.
ఈ రోప్వే గంటకు ఒక దిశలో 1,800 మంది ప్రయాణికులను రవాణా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులకు సేవలు అందిస్తుంది. దీన్ని ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యం పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా.. స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించి, ఆ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును గురించి గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. దీన్ని భక్తికి, ఆధునిక మౌలిక సదుపాయాలకు మధ్య వారధి అని అభివర్ణించారు.
ఈ పవిత్ర యాత్రను సురక్షితంగా, వేగంగా, మరింత అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే NHLML, ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం పెట్టుకుని.. అనేక మంది స్థానిక ప్రజలకు ఉద్యోగాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేవలం దేశానికి సేవ చేయడమే కాదని.. ఎంతో మంది ప్రజలకు మౌలిక సదుపాయాలను నిర్మించాలనే తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa