ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ ఊతం లభించింది. దుబాయ్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం శోభా రియాల్టీ గ్రూప్, అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మాణానికి రూ.100 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు చేపట్టిన దుబాయ్ పర్యటనలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.దుబాయ్లో శోభా రియాల్టీ గ్రూప్ ఛైర్మన్ రవి మేనన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రవి మేనన్ మాట్లాడుతూ అమరావతిలో గ్లోబల్ ప్రమాణాలతో ఒక స్టేట్ లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు తమ సంస్థ తరఫున ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. శోభా గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతిని ప్రపంచంలోని ఉత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్న తన ఆశయానికి ఈ విరాళం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు గల అపార అవకాశాలను చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించేందుకు ఏపీకి రావాలని రవి మేనన్ను ఆయన ఆహ్వానించారు. అమరావతిని ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని, గ్రీన్ ఎనర్జీ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలోని గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు.అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టు ఆధారిత అభివృద్ధి జోన్లలో టౌన్షిప్లు, లగ్జరీ హోటళ్లు, ఐటీ పార్కులు, మాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టవచ్చని సూచించారు.శోభా గ్రూప్ తమ ఆదాయంలో 50 శాతం సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించడాన్ని చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం పీ4 నమూనాతో "జీరో పావర్టీ మిషన్" అమలు చేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ దుబాయ్, ఒమన్, బహ్రెయిన్, ఖతార్, బ్రూనై దేశాలతో పాటు భారతదేశంలోని 14 రాష్ట్రాల్లోని 27 నగరాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోందని రవి మేనన్ ముఖ్యమంత్రికి వివరించారు.అనంతరం నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు హాజరుకావాలని శోభా రియాల్టీ యాజమాన్యాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa