ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో ఐటీ క్లస్టర్ పార్కు ఏర్పాటు ,,, ప్రభుత్వం అనుమతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 06:41 PM

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటుగా పరిపాలనా పరమైన అనుమతులు కూడా వేగంగా మంజూరయ్యేలా చూస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకువస్తున్నాయి. దీంతో ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఐటీ, ఏఐ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. అయితే ఇదే సమయంలో రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లాల ఐటీ క్లస్టర్ పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. కడపలో ఈ ఐటీ క్లస్టర్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవిరెడ్డి వెల్లడించారు. ప్రతిపాదిత ఐటీ క్లస్టర్ పార్కు ఏర్పాటుకు కావాల్సిన భూమిని జిల్లా యంత్రాంగం ఇప్పటికే గుర్తించిందని వివరించారు.


టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తోందని మాధవి రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా విశాఖపట్నాన్ని ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించారు. అలాగే తిరుపతి. శ్రీసిటీ, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లను ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కర్నూలు, అనంతపురం సహా మిగతా రాయలసీమ జిల్లాల్లో డిఫెన్స్ , సోలార్ ఎనర్జీ, డ్రోన్ టెక్నాలజీకు సంబంధించిన కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లి నియోజకవర్గంలోనూ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఐటీ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


ఈ క్రమంలోనే కడపలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మాధవి రెడ్డి వెల్లడించారు. ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూయర్లను ఆకర్షించి, ఈ ప్రాంతంలో ఐటీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు.


ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) విభాగం ఇప్పటికే కడప జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. కడపలో ఐటీ పార్కు ఏర్పాటు కోసం గుర్తించిన 10 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించాలని, ప్రతిపాదిత ఐటీ పార్క్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆదేశించినట్లు కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa