ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసీమ్ మునీర్‌ క్రూరమైన నియంత అంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని

international |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 05:12 PM

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ పాక్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని, మానసికంగా అస్థిరమైన వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ 'ఎక్స్' వేదికగా ఈ ఆరోపణలు చేశారు. మునీర్ పాలనలో అణచివేత గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని, అధికార దాహంతో కళ్లుమూసుకుపోయిన ఆయన దాని కోసం ఎంతకైనా తెగిస్తారని దుయ్యబట్టారు.మే 9, నవంబర్ 26 మురిడ్కే ఘటనలను ప్రస్తావిస్తూ.. ఇవి అధికార దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణలని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. పోలీసులు, భద్రతా సిబ్బంది తమ పార్టీ (పీటీఐ) కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. "నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఏ నాగరిక సమాజంలోనూ ఊహించలేం. మహిళలపై ఇంతటి క్రూరత్వం గతంలో ఎన్నడూ చూడలేదు" అని ఆయన పేర్కొన్నారు.తన భార్య బుష్రా బీబీని ఏకాంత నిర్బంధంలో ఉంచి అసీమ్ మునీర్ వేధిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. "బానిసత్వంలో బతకడం కన్నా మరణమే మేలు. అసిమ్ మునీర్ నాపై, నా భార్యపై అన్ని రకాల అన్యాయాలకు పాల్పడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడి కుటుంబం కూడా ఇంతటి క్రూరత్వాన్ని ఎదుర్కోలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. "ఆయన ఎన్ని చేసినా సరే, నేను తలవంచను, లొంగిపోను అని మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను" అని తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa