జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ ఆపరేషన్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. కేరన్ సెక్టార్లో ఈ ఘటన చోటుచేసుకుంది.శుక్రవారం రాత్రి కేరన్ సెక్టార్లోని 'పింపుల్' అనే ఫార్వర్డ్ డిఫెండెడ్ లొకేషన్ సమీపంలో 21 గ్రెనేడియర్స్ దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన సైనికులు కాల్పులు ప్రారంభించారు. దీనికి ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడంతో కొద్దిసేపు కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ పింపుల్" పేరుతో ఈ సైనిక చర్య కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.ప్రస్తుతం ఆ ప్రాంతమంతా సైన్యం అధీనంలో ఉంది. మరే ఇతర ఉగ్రవాది అయినా నియంత్రణ రేఖ దాటి లోపలికి ప్రవేశించి ఉండవచ్చనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు.శీతాకాలంలో పర్వత మార్గాలను భారీ మంచు కప్పివేసే లోపే, వీలైనంత ఎక్కువ మంది ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపాలని నియంత్రణ రేఖకు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో సైన్యం ఎల్ఓసీ వెంబడి 24 గంటలూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు భద్రతా దళాలు తమ వ్యూహాన్ని మార్చాయి. ఉగ్రవాదులను ఏరివేయడంతో పాటు వారికి సహకరిస్తున్న ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, సానుభూతిపరులు, అలాగే డ్రగ్స్ స్మగ్లింగ్, హవాలా వంటి ఆర్థిక మూలాలను కూడా ధ్వంసం చేసేందుకు ముమ్మరంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa