భారత క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ నెలవారీ భరణం రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే అలీమోనీగా ఈ మొత్తం అందుతున్నా, జీవన వ్యయం పెరిగిపోయిందని, తనకు తగిన స్థాయి జీవితం కోసం మరింత అవసరమని ఆమె వాదన. ఈ కేసు మళ్లీ చర్చల్లో పడటంతో సోషల్ మీడియా హడావిడి అయింది.
విడాకులు తీసుకున్న తర్వాత కూడా మాజీ భర్తపై ఆర్థికంగా ఆధారపడటం సరైనదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "స్వతంత్రంగా జీవించడం, సొంత ఆదాయం సంపాదించుకోవడం ఎందుకు రాదు?" అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల స్వావలంబనపై ఈ ఘటన మరోసారి చర్చను రేకెత్తిస్తోంది.
మరోవైపు కొందరు మెయింటెనెన్స్ నియమాలపై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. భరణం భర్త ఆదాయం ఆధారంగా కాకుండా, జీవన వ్యయం, పిల్లల భవిష్యత్తు ఖర్చులు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని వాదిస్తున్నారు. "అతను ఎంత సంపాదిస్తున్నాడో చూసి డిమాండ్ చేయడం సరికాదు" అని ఈ వర్గం గట్టిగా నొక్కి చెబుతోంది.
ఈ వివాదం కేవలం షమీ-హసీన్ మధ్య సమస్య మాత్రమే కాదు, దేశంలోని విడాకుల తర్వాత ఆర్థిక బాధ్యతలు, మహిళల హక్కులు, సమాజ అంచనాలపై పెద్ద చర్చను రేకెత్తిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి, దాని ప్రభావం భవిష్యత్ కేసులపై ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa