ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బెవరేజెస్ ప్లాంట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:00 PM

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాయలసీమ జిల్లాకు మరో గుడ్ న్యూస్ అందింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బెవరేజెస్ ప్లాంట్ రాయలసీమలో ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. కర్నూల్ జిల్లాలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. మెక్సికో తర్వాత రెండో ప్లాంట్ కర్నూలు జిల్లాకు వచ్చిందని వెల్లడించారు. కర్నూలు జిల్లాలో సుమారుగా 3 వేలకోట్ల రూపాయలతో రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ ఏర్పాటు చేయనున్న ప్లాంటును ఉద్దేశించి మంత్రి టీజీ భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు.


కర్నూలు జిల్లాలోని బ్రాహ్మణపల్లి వద్ద రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ఈ రిలయన్స్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లిలో నిర్వహించనున్న కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి టీజీ భరత్.. ప్రపంచంలో రెండో అతిపెద్ద బెవరేజెస్ ప్లాంట్‌ను తమ ప్రభుత్వం కర్నూల్ జిల్లాకు తీసుకొచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్‌తోనే ఇది సాధ్యమైందని టీజీ భరత్ వెల్లడించారు. కర్నూలు జిల్లాలో రిలయన్స్ బెవరెజెస్ ప్లాంట్ ఏర్పాటు కారణంగా 5 వేల మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి వివరించారు. రిలయన్స్ బెవరెజెస్ ప్లాంట్‌ను నిర్ణీత సమయానికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.


మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రకాశం జిల్లా పెదఈర్లపాడులో పర్యటించిన చంద్రబాబు.. ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమని అన్నారు.


అందులో భాగంగా ఈ సంవత్సరం లక్ష మంది మహిళలను ఎంటర్‌ప్రెన్యూయర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చంద్రబాబు వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న తమ మాట నిలబెట్టుకుంటామని.. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa