ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత జగన్ ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ ఉపసంహరించుకున్నారు.వివరాల్లోకి వెళితే, అక్టోబర్లో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక నవంబర్ 14న కచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. ఈ గడువు సమీపిస్తున్న వేళ, ఈ నెల 6న వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన మెమో దాఖలు చేశారు.మంగళవారం ఈ మెమోపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం విచారణ చేపట్టారు. జగన్కు మినహాయింపు ఇవ్వడాన్ని ఈ సందర్భంగా సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు ఆయన హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై జగన్ తరఫు న్యాయవాది జి. అశోక్రెడ్డి వాదనలు వినిపిస్తూ... హైకోర్టు గతంలోనే ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడం అధికార యంత్రాంగానికి ఇబ్బందికరమనే ఉద్దేశంతోనే మినహాయింపు కోరామని, అంతేకానీ కోర్టుకు హాజరయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరించారు.అనంతరం, తాము ఈ నెల 21వ తేదీలోగా కోర్టు ముందు హాజరవుతామని పేర్కొంటూ కొత్త మెమో దాఖలు చేస్తున్నట్లు న్యాయవాది తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa