ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిలో ఉల్లి ఒక్క రూపాయి మాత్రమే.. కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధర

national |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 08:30 PM

దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రతీ సంవత్సరం.. ఉల్లి, టమాటా ధరలు చూస్తే.. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి లాగే ఉంటుంది. ఒక్కోసారి కిలో టమాట, ఉల్లి.. ఏకంగా రూ.200, ఆపైన పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొన్నిసార్లు కిలో రూ.1కి పడిపోయిన సంఘటనలు అనేకం చూశాం. భారీ ధరలు ఉన్నాయని.. రైతులు ఇలా ఉల్లి, టమాట పంటను పండిస్తే.. తీరా అవి పండి చేతికి వచ్చేసరికి రేటు పతనం అవుతుంది. అప్పుడు భారీగా పెట్టుబడి పెట్టి పండించిన పంటకు కనీసం పెట్టిన ఖర్చులు కూడా రాకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు .. రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కిలో రూ.1 పలకడంతో.. ఏం చేయాలో తోచక అన్నదాతలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.


మధ్యప్రదేశ్‌లోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో ఉల్లి ధరలు అనూహ్యంగా పడిపోయాయి. దీంతో పంట సాగు, కోత, రవాణా ఖర్చులను కూడా రైతులు సంపాదించలేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఉల్లిధర బాగా పడిపోతుండగా.. తాజాగా మాండ్‌సౌర్‌లో కిలో ఉల్లి కేవలం ఒకే ఒక్క రూపాయి పలకడం గమనార్హం. పంత్ పిప్లోడాకు చెందిన బాబు మాల్వీ అనే ఉల్లి రైతు.. మీడియాతో మాట్లాడుతూ.. తన భూమిలో పండిన 6-7 క్వింటాళ్ల ఉల్లిని కిలో రూ.1.99 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంట అంత అమ్మినా వచ్చిన ధర.. దాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు అయిన రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదని వాపోయారు.


రత్లాం వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలో కనీస ధర క్వింటాల్‌కు రూ.200 వద్ద రికార్డయింది. అంటే కిలో రూ.2 మాత్రమే పలికింది. ఇక సగటు ధర క్వింటాల్‌కు రూ.600గా పలుకుతోంది. ఇక ఉల్లి పంటను పండించేందుకు.. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలకు తాము పెట్టిన కనీస ఖర్చులను కూడా రాబట్టలేకపోతున్నామని కన్నీరుమున్నీరు అవుతున్నారు.


కారణాలు.. డిమాండ్‌లు


ఇలా ఉల్లిధరలు ఒకేసారి భారీగా పతనం కావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు, రైతులు విశ్లేషిస్తున్నారు. రైతులు ఈ ఏడాది అధిక పంటను పండించడం, ఉల్లి ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో.. దేశంలో ఇప్పటికే ఉన్న పాత ఉల్లి స్టాక్ ఉండటం వల్ల రేటు భారీగా పడిపోయిందని పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఉల్లి పంట ఉత్పత్తి అధికంగా ఉండటంతో పాటు.. నెలల తరబడి నిల్వ ఉంచిన పాత ఉల్లి, కొత్త పంట ఒకేసారి మార్కెట్‌కు రావడం వల్ల ఇలా ధరలు పడిపోయినట్లు చెబుతున్నారు.


ఇతర దేశాలకు ఉల్లి పంటను ఎగుమతి చేయకుండా.. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై విధించిన ఆంక్షలు కూడా ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం అని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో అధికంగా ఉల్లి పంట పండించే మాల్వా ప్రాంతంలోని రైతులు.. తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. తమకు ఉల్లి, వెల్లుల్లి పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని అమలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.


రైతుకు, వినియోగదారుడికి తేడా


అయితే రైతులు కిలో ఉల్లిని ఇంత తక్కువకు హోల్‌సేల్‌గా అమ్ముతున్నా.. రిటైల్ మార్కెట్‌లో మాత్రం వినియోగదారులకు ఆ ధరకు లభించడం లేదు. సాధారణంగా రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.15 పలుకుతోంది. దీంతో అటు రైతుకు నష్టం రావడమే కాకుండా.. వినియోగదారుడికి కూడా భారీ ధర చెల్లించాల్సి వస్తోంది. ఇందులో మధ్యలో ఉన్న దళారులే లాభపడుతున్నారని.. అటు అన్నదాతలు, ఇటు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa