ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్‌లో ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు?.. వీరే గెలవడానికి కారణం

national |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 08:41 PM

దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కేంద్రంగా నిలిచిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు మంగళవారం రికార్డు స్థాయి పోలింగ్‌తో ముగిసింది. ఎన్నికల తుది ఫలితాలు ఈ నెల 14వ తేదీనే వెల్లడి కానుండగా.. మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చను రేకెత్తించాయి. ముఖ్యంగా ప్రతీ ఒక్కరూ బీహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతోందని ముక్తకంఠంతో తేల్చాయి. బీహార్ అసెంబ్లీలో మొత్తంగా 243 స్థానాలు ఉండగా.. 130 స్థానాలకంటే ఎన్డీఏ తక్కువ దక్కించుకోదని చెప్పాయి. ఇదంతా బాగానే ఉండగా.. ఎన్డీఏనే ఎక్కువగా గెలవడానికి గల కారణం ఏంటనే దానిపై విస్తృత చర్చ సాగుతోంది. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగిన తొలి విడత పోలింగ్‌లో 69.04 శాతం మంది మహిళలు ఓట్లు వేయగా, 61.56 శాతం పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకో రెండో విడతలో 73.03 శాతం మహిళలు, 64.1 శాతం పురుషులు ఓట్లు వేశారు. ఇలా రెండు విడతల్లో కలిసి మొత్తంగా 71.6 శాతం మంది మహిళలు ఓట్లు వేయగా.. 62.8 శాతం మంది పురుషులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఓటు వేసిన వాళ్లలో మహిళలే ఎక్కువగా ఉండడం.. వారందరి ఓట్లు ఎన్డీఏకే వెళ్లినట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై వలసలు, ఉపాధి లేమి వంటి అంశాల కారణంగా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ.. మహిళా ఓటర్లు మాత్రం ఆయనకు గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. చాలా మంది మహిళా ఓటర్లు నితీశ్‌ను ఇప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నమ్మకమైన నాయకుడిగానే చూస్తున్నారు. గత రెండు దశాబ్దాలలో నితీశ్ కుమార్ ప్రభుత్వం అమలు చేసిన మహిళా సాధికారత పథకాలు ఈ నమ్మకానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. మద్యపాన నిషేధం, జీవికా కార్యక్రమం, మెరుగైన శాంతిభద్రతలు వంటి చర్యలు మహిళలకు సురక్షితమైన జీవనాన్ని అందించాయి.


ముఖ్యంగా మద్యపాన నిషేధం వల్ల తమ ఇళ్లకు భద్రత పెరిగిందని భావిస్తున్న మహిళలు.. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏకే ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కోసం ఆ రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా లేరు. ముఖ్యంగా 2000వ దశకం ప్రారంభంలో రూపుదిద్దుకున్న 'జీవికా' కార్యక్రమం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, జీవనోపాధిని పటిష్టం చేసింది. ఈ పథకం ద్వారా ఏర్పడిన అనేక మహిళా స్వయం సహాయక బృందాలు నేడు ఆదాయపు పన్ను చెల్లించే స్థాయికి చేరుకోవడం, క్షేత్ర స్థాయిలో మహిళలు ఆర్థికంగా సమాజాన్ని ప్రభావితం చేయడానికి నిదర్శనం. వీటి కారణంగానే దళిత మహిళల ఆదాయాలు పెరిగి, ఆరోగ్య సంరక్షణ, విద్యలో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్గింది. వీటి ఈ అన్ని కారణాల వల్ల మహిళలు ఎక్కువగా ఎన్డీఏకు ఓట్లు వేసి గెలిపించనున్నట్లు అంతా భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa