ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. బంగాళాఖాతంలో ఇప్పటికే ఓ అల్పపీడనం ఏర్పడగా.. నవంబర్ 21వ తేదీ నాటికి మరో అల్పపీడనం కూడా ఏర్పడనుంది. వరుస అల్పపీడనాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంట గంటకు 35 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సోమవారం వరకూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వానలు
మరోవైపు బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో వానలు కురవనున్నాయి. సోమవారం రోజున నెల్లూరు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షం కురిసే సమయంలో బహిరంగ ప్రాంతాల్లో ఉండొద్దని సూచించింది.
మరోవైపు ఈ అల్పపీడనం పూర్తి కాగానే.. బంగళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో నవంబర్24 నుంచి నవంబర్ 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్నారు. వరుస అల్పపీడనాలు, వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనులలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ఏపీపై ఎంత ప్రభావం చూపించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోయాయి. భారీగా పంట నష్టం సంభవించింది. కేంద్ర బృందాలు కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాయి. తుఫాను నష్టంపై ఓ అంచనాకు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa