ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌ తీర్థయాత్రలో భారత మహిళ మిస్సింగ్.. ఇస్లాంలోకి మతం మారి పాక్ వ్యక్తితో పెళ్లి

national |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 08:49 PM

గురునానక్ దేవ్ 555వ జయంతి (ప్రకాష్ పర్వ్) సందర్భంగా పాకిస్తాన్‌లోని గురుద్వారాలను సందర్శించేందుకు వెళ్లిన సిక్కుల తీర్థయాత్ర బృందంనుంచి పంజాబ్‌కు చెందిన ఒక భారతీయ సిక్కు మహిళ కనిపించకుండా పోయారు. ఆమె ఇస్లాం మతంలోకి మారి.. పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సంఘటన భద్రతాపరమైన ఆందోళనలకు దారితీసింది. పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన 52 ఏళ్ల సరబ్‌జిత్ కౌర్ నవంబర్ 4వ తేదీన భారత్ పాక్ సరిహద్దుల్లోని వాఘా-అటారీ నుంచి 1,992 మంది సిక్కు యాత్రికుల బృందంతో కలిసి పాకిస్తాన్‌లోకి ప్రవేశించారు.


అయితే ఈ యాత్రకు వెళ్లిన వారంతా.. 10 రోజుల యాత్ర తర్వాత నవంబర్ 13వ తేదీన పాకిస్తాన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చింది. సరబ్‌జిత్ కౌర్ మాత్రం వారితో రాకపోవడం గమనార్హం. ఉర్దూ భాషలో ఉన్న ఒక నికాహ్నామా (ఇస్లామిక్ వివాహ ఒప్పందం) పత్రం బయటికి వచ్చింది. ఈ పత్రం ప్రకారం.. సరబ్‌జిత్ కౌర్ ఇస్లాం మతాన్ని స్వీకరించి.. తన పేరును నూర్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత లాహోర్‌కు సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేఖుపురాకు చెందిన నాసిర్ హుస్సేన్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పత్రం అధికారిక పత్రమని ఇంకా ఎవరూ ధృవీకరించకపోవడం గమనార్హం.


సరబ్‌జిత్ కౌర్‌కు గతంలోనే పెళ్లి అయింది. ఆమె తన మాజీ భర్త కర్నైల్ సింగ్.. ఇతను దాదాపు 30 ఏళ్లుగా ఇంగ్లాండ్‌లో నివసిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సరబ్‌జిత్ కౌర్ పాకిస్తాన్ వెళ్లి ఇంకా తిరిగి రాకపోవడంతో.. ఇక్కడి ఇమ్మిగ్రేషన్ విభాగం వెంటనే పంజాబ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే.. పాకిస్తాన్ నుంచి ఆమె బయలుదేరి.. భారత్‌లోకి వచ్చినట్లు ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో ఆమె పేరు లేకపోవడం మరిన్ని అనుమానాలను తావిస్తోంది.


మరోవైపు.. ప్రస్తుతం భారతీయ దౌత్య కార్యాలయం అధికారులు.. పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సంఘటనపై పంజాబ్ పోలీసులు ప్రాథమిక నివేదికను ఇతర భారతీయ ఏజెన్సీలకు పంపించారు. సిక్కుల అత్యున్నత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) ప్రతీ సంవత్సరం పాకిస్తాన్‌లోని చారిత్రక గురుద్వారాలను సందర్శించడానికి యాత్రికుల బృందాన్ని పంపిస్తోంది. భద్రతా సమస్యల కారణంగా గత నెలలో ఈ యాత్రకు అనుమతిని మొదట తిరస్కరించినప్పటికీ.. తర్వాత భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య మతపరమైన సందర్శనలకు సంబంధించి భద్రతాపరమైన ఆందోళనలను పెంచుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa