ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కామ్ కేంద్రాలలో చిక్కుకున్న భారతీయులను రక్షించిన ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Thu, Nov 20, 2025, 04:55 PM

ఆగ్నేయాసియా దేశాల్లోని స్కామ్ కేంద్రాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మయన్మార్‌లోని మయావడి ప్రాంతంలో ఉన్న స్కామ్ కేంద్రాల నుంచి విముక్తి పొందిన 125 మంది భారతీయులను ప్రభుత్వం బుధవారం సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది. థాయ్‌లాండ్‌లోని మే సోట్ పట్టణం నుంచి భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ప్రత్యేక సైనిక రవాణా విమానంలో వీరిని స్వదేశానికి తరలించినట్లు బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు మయన్మార్‌లోని స్కామ్ కేంద్రాల నుంచి థాయ్‌లాండ్ మీదుగా మొత్తం 1,500 మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చినట్లు ఎంబసీ తెలిపింది. భారతీయుల తరలింపు ప్రక్రియలో థాయ్‌లాండ్ ప్రభుత్వానికి చెందిన వివిధ ఏజెన్సీలు, టాక్ ప్రావిన్స్ అధికారులు అందించిన సహకారం ఎంతో కీలకమని పేర్కొంది. స్వదేశానికి చేరుకున్న కొందరు భారతీయుల ఫొటోలను కూడా ఎంబసీ 'ఎక్స్' ఖాతాలో పంచుకుంది.ఈ సందర్భంగా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ఉద్యోగ ఆఫర్లను స్వీకరించే ముందు విదేశీ కంపెనీలు, నియామక ఏజెంట్ల పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని హెచ్చరించింది. అలాగే, భారతీయులకు థాయ్‌లాండ్ అందిస్తున్న వీసా రహిత ప్రయాణ సౌకర్యం కేవలం పర్యాటకం, స్వల్పకాలిక వ్యాపార పనుల కోసం మాత్రమేనని, దానిని ఉద్యోగాల కోసం దుర్వినియోగం చేయవద్దని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa