నేరస్థులు శిక్ష అనుభవించే ప్రదేశమైన జైలు అనగానే.. కఠిన నిబంధనలు, కనీస వసతులు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మార్లు వార్తలోకెక్కిన ఈ జైల్లో.. కొందరు ఖైదీలు కావాలనుకుంటే లిక్కర్, సిగరెట్లు, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని తెలుస్తోంది.
శివమొగ్గ జైలులో ఖైదీల విలాసాలకు సంబంధించిన ఆనవాళ్లు ఇటీవల బయటపడిన నేపథ్యంలో.. భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. నిత్యం తనిఖీలు చేస్తూ.. ఖైదీలపై ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలోనే శనివారం రోజు ఉదయం ఒక ఆటో డ్రైవర్ వచ్చి జైలు క్యాంటీన్ కోసమని గేటు బయట ఐదు అరటి గెలలు దించి వెళ్లగా.. భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో ఆ అరటి గెలలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా.. కాడలు తెరచి, తిరిగి అతికించినట్లుగా కనిపించింది. దీంతో సిబ్బంది వాటిని తెరిచారు. అందులో ఉన్న వాటిని చూసి షాకయ్యారు. ఎందుకంటే అరటి గెలెల్లో.. జాగ్రత్తగా గమ్ టేప్తో చుట్టిన సిగరెట్ల ప్యాకెట్లు, గంజాయి వంటి మత్తు పదార్థాలు బయటపడ్డాయి. ఈ వినూత్న స్మగ్లింగ్ పద్ధతి చూసి భద్రతా సిబ్బంది కూడా నివ్వెరపోయారు.
అయితే స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 123 గ్రాముల గంజాయి, డజన్ల సంఖ్యలో సిగరెట్ ప్యాకెట్లు ఉన్నట్లు శివమొగ్గ పోలీసులు వెల్లడించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆటోలో సరుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, ఈ స్మగ్లింగ్లో జైలు అధికారులు, సిబ్బందికి ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నిజానికి శివమొగ్గ జైలులో ఖైదీలు ఇటీవల కాలంలో పార్టీలు చేసుకున్న ఆనవాళ్లు, అలాగే ఖరీదైన సెల్ఫోన్లను ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణలు ఈ స్మగ్లింగ్ దందాతో ముడిపడి ఉన్నాయని భావిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa