జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. హిందూ సమాజమే ప్రపంచాన్ని నిలబెట్టడానికి కేంద్రమని ఆయన ఉద్ఘాటించారు. హిందువులు లేకపోతే.. ప్రపంచం మనుగడలో ఉండదని స్పష్టం చేశారు. జాతి ఘర్షణల తర్వాత మణిపూర్లో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి కాగా.. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు కారణం అయ్యాయి.
మణిపూర్లోని ఒక కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోహన్ భగవత్.. హిందూ సమాజం అమరమైనది అని నొక్కి చెప్పారు. భారతదేశ నాగరికత యనాన్ (గ్రీస్), మిశర్ (ఈజిప్ట్), రోమ్ వంటి సామ్రాజ్యాలన్నింటికంటే ఎక్కువ కాలం మనుగడ సాగించిందని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూసిందన్నారు. యనాన్, మిశర్, రోమా వంటి నాగరికతలన్నీ భూమండలం నుంచి అంతరించిపోయాయన్నారు. కానీ మన నాగరికతలో ఏదో ఉందని.. అందుకే మనం ఇంకా ఇక్కడే ఉన్నామని భగవత్ అన్నారు.
అలాగే హిందూ సమాజాన్ని ధర్మానికి గ్లోబల్ కస్టోడియన్గా అభివర్ణించారు. భారత్ అనేది ఒక అమర నాగరికత పేరని తెలిపారు. మనం మన సమాజంలో ఒక నెట్వర్క్ను సృష్టించామని.. దాని కారణంగా హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. హిందువులు అంతరించిపోతే.. ప్రపంచం కూడా మనుగడలో ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. గతంలో భారత దేశంలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఒకే పూర్వీకుల సంతతి వారని.. కాబట్టి భారత దేశంలో ఎవరూ 'నాన్-హిందువులు' కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మణిపూర్ సంక్షోభం, జాతి ఘర్షణల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దేశ నిర్మాణానికి మొదటి అవసరం బలం అని చెప్పిన మోహన్ భగవత్.. బలం అంటే ఆర్థిక సామర్థ్యం అని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్వావలంబన కలిగి ఉండాలని.. మనం ఎవరిపైనా ఆధార పడకూడదని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో.. ప్రభుత్వం స్వదేశీ విధానాన్ని తిరిగి తెరపైకి తీసుకువస్తున్న సమయంలో భగవత్ చేసిన ఈ ఆర్థిక స్వావలంబన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. స్వావలంబన మార్గం కష్టం కాదన్న భగవత్.. నక్సలిజం క్షీణతను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. సమాజం దాన్ని ఇంక సహించకూడదని నిర్ణయించుకోవడం వల్లే నక్సలిజం అంతమైందని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంపై జరిగిన స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా ఆయన ఉదాహరణగా చూపారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించేవాడు కాదని.. కానీ భారత దేశంలో వారి సూర్యుడు అస్తమించడం ప్రారంభించాడని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa