ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ.. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లోని ఇతర డాక్టర్లతో తను వారికి నాయకుడిగా చెప్పుకునేవాడని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఓ ప్రిన్స్ మాదిరిగా తనను తాను ‘ఎమిర్’గా చెప్పుకునేవాడని పేర్కొన్నాయి. అయితే, 2016లో భద్రతా దళాలు ఎన్కౌంటర్లో హతమైన కశ్మీర్ ఉగ్రవాది బుర్హాన్ వనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయేవాడని ఎన్ఐఏ వర్గాలు గుర్తించాయి. అరెస్టైన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అనుమానితుల నుంచి దర్యాప్తు అధికారులు కీలక సమాచారం రాబట్టారు.
ఉమర్ నబీ పాత్రను ‘ఎమిర్’గా ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ వైద్యుడు ముజామిల్ షకీల్ వెల్లడించాడు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా ఈ మాడ్యూల్లోకి మొదట చేరిన వ్యక్తి ముజామిల్. అలాగే, మహిళా వైద్యురాలు డాక్టర్ షహీన్ సయీద్ నుంచి కూడా విచారణలో ముఖ్యమైన సమాచారం రాబట్టారు.
ఉమర్ నబీ అనుభవం, హోదాతో పోల్చితే తాను ఓ చిన్న కూలీ లాంటి వ్యక్తినని ముజామిల్ చెప్పినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు తమ ప్లాన్కు ‘ఆపరేషన్ ఎమిర్’ అని పేరును పెట్టుకున్నారని, ఆత్మాహుతి బాంబర్ దీనికి ముఖ్య సూత్రధారిగా ఉన్నాడని వివరించారు. టెర్రర్ మాడ్యూల్లోని ఉన్నత విద్యావంతుడు, అత్యున్నత ప్రతిభ కలిగిన ఉమర్ నబీకి 9 భాషలు తెలుసనని, సులభంగా అణు శాస్త్రవేత్త అయ్యేవాడని ముజామిల్ షేక్ చెప్పినట్టు అధికారులు పేర్కొన్నారు.
‘అతడ్ని (ఉమర్) మేము అడ్డుకోలేకపోయాం... ఎందుకంటే అతడి మాటలు వాస్తవాలు, పరిశోధనలతో ఉండేవి.. ఎప్పుడూ తనను తాను ఎమిర్గా చెప్పుకునేవాడు. పెద్దగా మాట్లాడేవాడు కాదు. చివరి వరకు అతడు మనం చేసేది మతం గురించి తప్ప మరొకటి కాదని అనేవాడు’ అని ముజామిల్ షకీల్ వెల్లడించినట్టు అధికారులు తెలిపారు.
అంతేకాదు, భారత్లో ముస్లింలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, వారిపై ఊచకోత కూడా జరిగే అవకాశం ఉందని దాడికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఉమర్ నూరిపోశాడని అధికార వర్గాలు చెప్పాయి. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు, 2023 జులైలో హర్యానాలోని నూహ్లో మత హింస, అదే ఏడాది మార్చిలో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ నాసిర్, జునైద్ అనే యువకుల హత్య సహా కొన్ని సంఘటనలతో తీవ్ర నిరాశకు గురైన నబీ.. ఆత్మాహుతి బాంబర్గా మారాడని విచారణలో ఉగ్రవాద నిందితులు బయటపెట్టారు.
ఇక, సగం పూర్తిచేసిన ఐఈడీతోనే ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. బాంబు తయారీకి ఎసిటోన్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్, పంచదార పొడిని వినియోగించాడని వివరించాయి. హర్యానాలో దాచిపెట్టిన పేలుడు పదార్థాలను జమ్మూ కశ్మీర్కు తీసుకెళ్లాలని టెర్రర్ మాడ్యూల్ తొలుత భావించింది. అక్కడ ఉమర్ ఉన్ నబీ పెద్దదే ప్లాన్ చేశాడని, కానీ, అది వీలుకాకపోవడంతో ఐఈడీ తయారీలో ఉపయోగించే యూరియాను నుహ్–మెవాత్ ప్రాంతం నుంచి తెప్పించడం మొదలుపెట్టాడని పేర్కొన్నాయి. అల్-ఫలాహ్ యూనివర్సిటీలోని తన గదిలో పేలుళ్లు, రసాయన సమ్మేళనాలపై పరీక్షలు కూడా చేసినట్టు తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa