సుమారు 12,000 సంవత్సరాలుగా నిద్రాణమై ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో ఇథియోపియాలోని ఈశాన్య ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఆదివారం రోజు ఉదయం పలు గంటల పాటు విస్ఫోటనం చెంది.. ఒక్కసారిగా దట్టమైన పొగ, బూడిదను ఎగజల్లింది. దీంతో సుమారు 14 కిలో మీటర్ల (9 మైళ్లు) ఎత్తుకు బూడిద లేసింది. ఈ బూడిద మేఘాలు ఎర్ర సముద్రాన్ని దాటి యెమెన్, ఒమన్ దేశాల వైపు ప్రయాణిస్తున్నాయి. అయితే ఈ విస్పోటనాన్ని కళ్లారా చూసిన ఓ వ్యక్తి.. నిజంగానే బాంబు పేలిందని తాను భావించినట్లు చెప్పారు.
అకస్మాత్తుగా 'బాంబు పేలుడు'
భూకంపాలు తరచుగా సంభవించే అఫార్ ప్రాంతంలో ఈ అగ్నిపర్వతం విస్ఫోటనంచెందడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. అగ్నిపర్వతం పేలిన వెంటనే పెద్ద శబ్దం, ఒక విధమైన షాక్ వేవ్ వచ్చిందని స్థానిక నివాసి అహ్మద్ అబ్దేలా తెలిపారు. "అకస్మాత్తుగా బాంబు పేలినట్లు అనిపించింది. ఈ ప్రాంతమంతా పొగ, బూడిదతో నిండిపోయింది" అని ఆయన విస్పోటనం గురించి భయానక అనుభవాన్ని వివరించారు. ఈ విస్ఫోటనం కారణంగా.. సమీపంలోని అఫ్డెరా గ్రామం మొత్తం సోమవారం కూడా దట్టమైన బూడిదతో నిండిపోయింది. ఈ ప్రాంతం సాధారణంగా పర్యాటకులకు, ముఖ్యంగా సమీపంలో ఉన్న ప్రఖ్యాత దనకిల్ ఎడారికి వెళ్లే గైడ్లకు, పర్యాటకులకు కేంద్రంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ గ్రామంలో పర్యాటకులు, గైడ్లు చిక్కుకుపోయినట్లు అబ్దేలా వెల్లడించారు.
అదృష్టవశాత్తు ఈ విస్ఫోటనం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక పరిపాలనా అధికారి మొహమ్మద్ సెయిద్ తెలిపారు. అయితే ఈ విపత్తు స్థానిక ప్రజల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అఫార్ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు ప్రధానంగా పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. బూడిద మేఘాలు పచ్చిక బయళ్లపై పడటం వలన పశువుల మేత, తాగునీరు కలుషితమై.. స్థానిక ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ అగ్నిపర్వత విస్ఫోటనం ఇథియోపియా, అరేబియా ద్వీపకల్పం మధ్య ఉన్న గగనతలంపై కూడా ప్రభావం చూపింది. దీని ఫలితంగా విమాన రాకపోకలకు ఆటంకం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు, విమానయాన అధికారులు ఈ బూడిద మేఘాల కదలికపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు. 12 వేల ఏళ్ల తర్వాత మెలకువ తెచ్చుకున్న ఈ అగ్నిపర్వతం.. పర్యావరణపరంగా, ఆర్థికపరంగా ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa