న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ఘనంగా జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్టు ఆమె గట్టిగా నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సాధనకు దేశ రాజ్యాంగమే ప్రధాన మార్గదర్శకమని, అది ప్రతి భారతీయుడికి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అందిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తోందని ఆమె కొనియాడారు.
గత కొన్నేళ్లలో భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా రాష్ట్రపతి 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని పేర్కొన్నారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘనత అని ఆమె గర్వంగా చెప్పారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ (GST) తీసుకొచ్చి దేశాన్ని ఒకే మార్కెట్గా మార్చామని, దీంతో వ్యాపార వాణిజ్యం బాగా సులువయిందని వివరించారు.
మహిళల సాధికారిత విషయంలో కూడా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని రాష్ట్రపతి గుర్తుచేశారు. ముస్లిం మహిళల జీవితాలను బంధాల నుంచి విముక్తి చేస్తూ ట్రిపుల్ తలాక్ అనే దురాచారాన్ని పూర్తిగా నిషేధించామని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా జమ్మూ-కాశ్మీర్ను దేశంలో పూర్తిగా ఏకీకరించేందుకు ఆర్టికల్ 370ని రద్దు చేయడం మరో కీలక మైలురాయిగా ఆమె పేర్కొన్నారు.
ఈ సంస్కరణలన్నీ రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగానే జరిగాయని, భవిష్యత్తులో భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ ఆదర్శాలను కాపాడుకుంటూ దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa