కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా అంకితమిచ్చిన సీనియర్ నాయకుడు, మూడుసార్లు కాన్పూర్ ఎంపీగా గెలిచిన శ్రీప్రకాశ్ జైస్వాల్ (81) శనివారం తుదిశ్వాస విడిచారు. కాన్పూర్లోని తన నివాసంలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.
2004 నుంచి 2009 వరకు యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా, తర్వాత 2011-2014 మధ్య యూపీఏ-2లో బొగ్గు గనుల శాఖ స్వతంత్ర బాధ్యతలతో మంత్రిగా శ్రీప్రకాశ్ జైస్వాల్ పనిచేశారు. ముఖ్యంగా బొగ్గు బ్లాక్ కేటాయింపుల కాలంలో ఆయన పాత్ర ఎప్పటికప్పుడు చర్చనీయాంశమైంది. రాజకీయంగా వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ, కాన్పూర్ ప్రజల్లో ఆయనకు మంచి పట్టు ఉండేది.
కేంద్ర మంత్రి కావడానికి ముందు 2000-2002 మధ్య ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (UPCC) అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీప్రకాశ్, పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1999, 2004, 2009లో కాన్పూర్ నుంచి లోక్సభకు ఎన్నికైన ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా పార్టీలో ఆయన సీనియారిటీ, అనుభవం ఎప్పుడూ గుర్తింపబడేవి.
శ్రీప్రకాశ్ జైస్వాల్ మరణ వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఘనంగా సంతాపం తెలిపారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు బలమైన నాయకత్వం కోల్పోయినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa