ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల అభివృద్ధినీ సమానంగా చూసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని మూడు పెద్ద జోన్లుగా విభజించి, ప్రతి జోన్కి ప్రత్యేక సీఈఓ నియమించి, స్వతంత్ర అభివృద్ధి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విధానం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్టల్ ఏరియాల్లో ఇప్పటివరకు వచ్చిన అసమానతలు తొలగిపోతాయన్నది ప్రభుత్వ వాదన.
కొత్త జోనల్ వ్యవస్థలో విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర జోన్కు 9 జిల్లాలు (శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు), అమరావతి కేంద్రంగా మధ్య ఆంధ్ర జోన్కు 8 జిల్లాలు, రాయలసీమ జోన్కు మిగిలిన 9 జిల్లాలు కేటాయించనున్నారు. ప్రతి జోన్కి రాష్ట్ర స్థాయి అధికారాలతో కూడిన స్వతంత్ర యంత్రాంగం ఉంటుంది. ఇకపై పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు ఒకే ప్రాంతంలోనే కేంద్రీకృతం కాకుండా మూడు జోన్లలోనూ సమంగా వ్యాపిస్తాయి.
ఈ మూడు జోన్లకు సీఈఓలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించే ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉత్తరాంధ్ర జోన్ సీఈఓగా యువ ఐఏఎస్ అధికారి యువరాజ్, అమరావతి జోన్ సీఈఓగా మీనా, రాయలసీమ జోన్ సీఈఓగా కృష్ణబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. వీరంతా ఇప్పటికే వివిధ శాఖల్లో అద్భుత పనితీరు కనబర్చిన అధికారులుగా గుర్తింపు పొందారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా నేతృత్వం వహించే హైపవర్ స్టీరింగ్ కమిటీ ఈ మూడు జోన్ల అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. త్వరలోనే అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2029 నాటికి ఏపీని సమతుల్య అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు లక్ష్యం… ఈ జోనల్ వ్యవస్థే ఆ దిశగా పెద్ద అడుగు అవుతుందని నమ్మకం వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa