రైతులకు అండగా నిలబడి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతుకి వెన్నుపోటు పొడుస్తోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అడుగడుగునా రైతుకి అండగా నిలబడి ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేసి రైతులకు దిక్కులేకుండా చేశారని ధ్వజమెత్తారు. ధాన్యం పండిస్తే కొనేవారు ఎవరూ లేరని, వరి అన్నం తింటే షుగర్ వస్తుందని సీఎం చంద్రబాబు ప్రచారం, యూరియా కృత్రిమ కొరత.. ఇలాంటివన్నీ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రల్లో భాగమేనని వరికూటి అశోక్ బాబు వివరించారు. తాము పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని శాంపిల్స్ పట్టుకుని రైతులే మిల్లర్లను ప్రాధేయపడాల్సిన దుస్థితికి వ్యవసాయాన్ని దిగజార్చారని మండిపడ్డారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు తన వ్యవసాయ వ్యతిరేక విధానాలను విడనాడటం లేదని స్పష్టం చేశారు. గన్నీ బ్యాగుల కొరత, ధాన్యం రవాణాకి లారీల కొరత, మద్ధతు ధర లేకపోవడం, వరికోత యంత్రాలకు డిమాండ్.. ఇలా అడుగడుగునా కష్టాలు రైతులను వెక్కిరిస్తూ రైతులు ధాన్యం అమ్ముకునే దారి కనపడటం లేదని, దానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని స్పష్టం చేశారు. ఇకనైనా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను మానుకోవాలని సీఎం చంద్రబాబుకి వరికూటి అశోక్ బాబు హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa