ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రేట్ సిట్టింగ్ ఛాలెంజ్ పేరుతో వినూత్న పోటీ

national |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 07:52 PM

ప్రస్తుతం ఆధునిక టెక్ యుగంలో మనిషి జీవితంలో సెల్‌ఫోన్ ఒక భాగం అయిపోయింది. చిన్నా పెద్దా.. ముసలి ముతక తేడా లేకుండా అంతా మొబైల్ బానిసలుగా మారుతున్నారు. ఫోన్లకు బానిసలై.. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న వారిని చూస్తూనే ఉన్నాం. అలాంటివారిని డీ అడిక్షన్ సెంటర్లకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అన్నం తినాలన్నా, నిద్రపోవాలన్నా, చదువుకోవాలన్నా... చేతిలో ఫోన్ ఉండాల్సిందే. బయట ప్రపంచంతో మాట్లాడటం మానేసి.. అంతా చిన్న స్క్రీన్ ప్రపంచంలో బందీలం అయిపోయాం. కుటుంబంతో మాట్లాడడానికి కూడా సమయం దొరకడం లేదు.


అయితే ఇలాంటి పరిస్థితి తమ వారికి రావద్దనే ఉద్దేశంతో పంజాబ్‌లోని ఓ గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. సెల్‌ఫోన్ వాడకం తగ్గించాలనే మంచి ఉద్దేశంతో.. ఒక పోటీని పెట్టారు. అందులో పాల్గొనేవారు.. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. అలా ఉన్న వారిని విన్నర్లుగా ప్రకటించి.. నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఉన్న గోలియా ఖుర్ద్ గ్రామం.. సెల్‌ఫోన్ అడిక్షన్‌కు ఈ వినూత్నమైన పరిష్కారంతో ముందుకొచ్చింది. గ్రామ పెద్దలు మొబైల్ వ్యసనాన్ని తగ్గించడానికి.. గ్రేట్ సిట్టింగ్ ఛాలెంజ్ అనే పేరుతో ఒక పోటీని పెట్టారు.


ఈ పోటీలో పాల్గొనేవారు మొబైల్ ఫోన్ లేకుండా.. నిద్రపోకుండా, వాష్‌రూమ్‌కు కూడా వెళ్లకుండా కేవలం ఒకే చోట కూర్చోవాలి. ఒకవేళ వారికి ఆకలి వేస్తే వారు కూర్చున్న చోటికే ఆహారాన్ని అందిస్తారు. ఇందులో ఎక్కువ సమయం పాటు కూర్చున్న వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఈ ఛాలెంజ్‌లో గెలిచిన వారికి సైకిల్‌తో పాటు నగదు బహుమతులు అందిస్తున్నారు.


ఈ పోటీలో చివరి వరకు ఉన్న ముగ్గురు వ్యక్తులను విజేతలుగా ప్రకటిస్తున్నారు. మొదటి బహుమతి కింద సైకిల్‌తోపాటు.. రూ. 4,500 నగదు అందిస్తున్నారు. అదే రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 2,500 ఇస్తున్నారు. మరోవైపు.. మూడో బహుమతిగా రూ. 1,500 నగదును ఇస్తున్నారు.


అయితే ఈ పోటీ నిర్వహించడానికి ఉన్న ప్రధాన ఉద్దేశం కేవలం.. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ఇవ్వడం మాత్రమే కాదని గోలియా ఖుర్ద్ గ్రామ పెద్దలు చెబుతున్నారు. మనం మొబైల్‌కు దూరంగా ఉన్నంత మాత్రాన మన జీవితం ఏమీ ఆగిపోదని ప్రజలకు తెలియజేయాలి అని తాము అనుకుంటున్నామని.. అదే అందరికీ తెలిసేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫోన్‌ వైపు నుంచి తల ఎత్తి.. కుటుంబంతో సమయం గడిపినప్పుడు నిజమైన ప్రశాంతత, సంతోషం లభిస్తుందని పోటీ నిర్వాహకులు పేర్కొన్నారు.


ఇక మొట్టమొదట నిర్వహించిన పోటీలోనే చిన్నారులు, యువత, పెద్దలు సహా మొత్తం 55 మంది పాల్గొనడం విశేషం. ఇదే ఈ మొబైల్ సమస్య తీవ్రతను, మార్పు కోసం ప్రజల్లో ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తోందని నిర్వాహకులు వెల్లడించారు. మొబైల్ వ్యసనాన్ని తగ్గించుకోవాలనే సంకల్పంతో ఈ 55 మంది కూర్చొని ఉండగా.. వారిలో ఎవరు విజేతలుగా నిలుస్తారోనని గోలియా ఖుర్ద్ గ్రామస్తులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa