వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆమె వైసీపీకి గుడ్బై చెప్పబోతున్నారా? మరో పార్టీలో ఎంట్రీకి రెడీ అవుతున్నారా? అన్న ప్రశ్నలకు ‘అవును’ అనే సంకేతాలే వినిపిస్తున్నాయి.తాజాగా బయటకు వచ్చిన లీకుల ప్రకారం, ఈ సమాచారాన్ని మీడియాకు అందించింది రజని సన్నిహిత వర్గమేనన్న ప్రచారం కూడా ఉంది. మరి రజని ఎందుకు పార్టీ మారాలని ఆలోచిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగొచ్చు.ఇటీవలి ఎన్నికల్లో ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. గతంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన రజనికి జగన్ హఠాత్తుగా గుంటూరు వెస్ట్ను కేటాయించడం ఆమెకు పెద్ద షాక్ అయ్యింది. అక్కడ ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఫలితాల నుండి కోలుకున్న రజని, చర్చల అనంతరం మళ్లీ తన పాత బలమైన స్థలం చిలకలూరిపేట నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.అయితే ఇటీవల పార్టీ హైకమాండ్ నుంచి రజని ఊహించని ఆదేశం అందుకుంది. చిలకలూరిపేట స్థానాన్ని ఖాళీ చేసి, 2029లో రేపల్లె నుంచి పోటీ చేసేలా వ్యూహరచన చేసుకోవాలని సూచించారట సజ్జల. రేపల్లెలో వరుస విజయాలతో మంత్రిగా దూకుడు మీదున్న అనగాని సత్యప్రసాద్ను ఎదుర్కొవాలంటే రజనియే సరైన ప్రత్యర్థి అని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.కానీ గతంలో చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్… ఇప్పుడు అక్కడి నుంచి రేపల్లెకు తరలించాలనే ఈ నిర్ణయం ఆమెకు నచ్చడం లేదట. తన అసలు కార్యక్షేత్రంగా ముద్ర వేసుకున్న పేటను విడిచి వెళ్లాలన్న ఆలోచన రజనిని అసహనానికి గురిచేస్తోందని అంటున్నారు. దీంతోనే ఆమె పార్టీ మారే దిశగా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం బలపడుతోంది.ఏ పార్టీ వైపు ఆమె మొగ్గు చూపుతారో ఇంకా స్పష్టత లేదు. అయితే వైసీపీకి గుడ్బై చెప్పే నిర్ణయం తీసుకున్నట్లు లీకులు వస్తుండటం రాజకీయంగా ఆసక్తికర మలుపు తీసుకొచ్చింది. ఈ లీకుల వెనుక రజని టీమ్ చేతులే ఉన్నారని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తలా తోకగా మారడంతో, తన రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టుకున్నట్టు అనిపిస్తోందని రజని భావిస్తున్నారట. ఇక పార్టీ హైకమాండ్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa