ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ మోసాలు జరగకుండా కేంద్రం కొత్త ప్లాన్.. స్మార్ట్‌ఫోన్లలో కొత్త యాప్

national |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 08:31 PM

దేశంలో రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో.. ప్రజలను సైబర్ మోసాలకు గురి చేస్తున్నారు. అకౌంట్లలోకి చొరబడి.. బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఎక్కడో ఉండి.. క్షణాల్లో రూ. లక్షలు, రూ.కోట్లు కొట్టేస్తున్నారు. అంతేకాకుండా ఫోన్లు, కంప్యూటర్లలో ఉండే రహస్య సమాచారం, ఫోటోలు, వీడియోలను కొట్టేసి.. వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. సైబర్ కేటుగాళ్లు తమ పంథా మార్చుకుని నేరాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ.. నవంబర్ 28వ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. మొబైల్ తయారీదారులు కొత్త స్మార్ట్‌ఫోన్లలో 'సంచార్ సాథి' అనే ప్రభుత్వ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ ఇన్‌స్టాల్ చేయాలని తెలిపింది. ఈ ఆదేశాలు పాటించేందుకు కేంద్రం.. సెల్‌ఫోన్లు తయారు చేసే కంపెనీలకు 90 రోజుల సమయం ఇచ్చింది. ఇక ఈ సంచార్ సాథి యాప్‌ను.. మొబైల్ యూజర్లు డిజేబుల్ చేయడానికి వీలు లేకుండా.. ఇన్‌బిల్ట్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. సామ్‌సంగ్, వివో, ఒప్పో, షియోమీ సహా యాపిల్‌ కంపెనీలు కూడా ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.


అయితే.. సెల్‌ఫోన్లను విక్రయించడానికి ముందే ప్రభుత్వ లేదా థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడాన్ని సాధారణంగా యాపిల్ కంపెనీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. డూప్లికేట్ లేదా స్పూఫ్ చేసిన ఐఎంఈఐ నంబర్ల నుంచి సైబర్ ముప్పును ఎదుర్కోవడానికి ఈ సంచార్ సాథి యాప్ అవసరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ యాప్ ఇప్పటికే పోగొట్టుకున్న 7 లక్షలకు పైగా ఫోన్లను రికవరీ చేయడంలో సహాయపడిందని.. 37 లక్షలకు పైగా దొంగిలించబడిన ఫోన్లను బ్లాక్ చేసిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


సంచార్ సాథి యాప్ ఉపయోగాలు


అనుమానాస్పద కాల్‌లను రిపోర్ట్ చేయవచ్చు.


ఐఎంఈఐ నంబర్‌లను ధృవీకరించవచ్చు.


దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను కేంద్ర రిజిస్ట్రీ ద్వారా బ్లాక్ చేయవచ్చు.


అయితే ఈ సంచార్ సాథి యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభించింది. అప్పటి నుంచి.. ఈ సంచార్ సాథి యాప్ ద్వారా 37 లక్షలకు పైగా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేశారు.


నవంబర్ 28న జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం.. కొత్త ఫోన్లలో సంచార్ సాథి యాప్‌ను ప్రీ ఇన్‌స్టాల్ చేయడానికి 90 రోజుల గడువు ఇచ్చారు. అయితే ఇప్పటికే కంపెనీల నుంచి మార్కెట్లలోకి విడుదలైన ఫోన్ల కోసం.. తయారీదారులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా ఈ సంచార్ సాథి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశించారు. కానీ.. యాపిల్ కంపెనీ తమ సొంత యాప్‌లను మాత్రమే ప్రీ ఇన్‌స్టాల్ చేస్తుంది. విక్రయానికి ముందు ప్రభుత్వ యాప్‌లు, థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఆ కంపెనీ అంతర్గత విధానాలు అంగీకరించవు. గతంలో కూడా యాంటీ స్పామ్ మొబైల్ యాప్ విషయంలో టెలికాం రెగ్యులేటర్‌తో యాపిల్ సంస్థ తీవ్రంగా విభేదించింది. అయితే తమతో సంప్రదింపులు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడంపై మొబైల్ తయారీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. యాపిల్, శామ్‌సంగ్, షియోమీ లేదా టెలికాం మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa