ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 5 సంవత్సరాల క్రితం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బ్యాంకులను విలీనం చేశారు. ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగు తగ్గించాలని కేంద్రం అడుగులు వేస్తోంది. అనుకున్నవి అన్నీ సక్రమంగా జరిగితే 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికల్లా ఈ మెగా విలీన ప్రక్రయను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందటా. మెగా విలీనం తర్వాత దేశంలో 4 ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థ ఒకటి కథనం ప్రచురించింది.
మెగా విలీనం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తో పాటు కెనరా- యూనియన్ బ్యాంక్ విలీనంతో ఏర్పడే మరో బ్యాంక్ మాత్రమే ఉంటాయని కథనంలో పేర్కొంది. మొత్తంగా నాలుగు ప్రభుత్వ బ్యాంకులే సేవలందించనున్నాయి. ప్రస్తుతం ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్యాలెన్స్ షీట్ల బలోపేతం, నిర్వహణ సామర్థ్యాల పెంపు, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దడం వంటి అంశాలపై కేంద్రం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం, ఆ తర్వాత దేశీ వృద్ధి అవసరాలకు అనువైన బ్యాంకులుగా వాటిని తీర్చిదిద్దడం ఈ ప్రణాళికలో భాగమని తెలుస్తోంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులైన కెనరా బ్యాంక్- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను విలీనం చేయడం ద్వారా అతిపెద్ద బ్యాంకుగా తీర్చిదిద్దనున్నారని తెలుస్తోంది. మనుగడలో ఉండే అతిపెద్ద బ్యాంకుల లిస్టులో ఈ బ్యాంక్ ఉండనుందని తెలుస్తోంది. ఇక ఇండియ్ బ్యాంక్, యూకో బ్యాంకులను ఎస్బీఐ, పీఎన్బీ, బీఓబీలో కలపనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు సైతం పెద్ద బ్యాంకుల్లో విలీనం కానున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు విలీనం గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఈ విలీన ప్రణాళిక ఆర్థిక శాఖ వద్ద ఉందట. ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే కేబినెట్, ప్రధాని కార్యాలయానికి చేరనుంది. దీంతో పాటు మార్కెట్ పరమైన ఇబ్బందులు రాకుండా సెబీ నిబంధనలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ బ్యాంకుల విలీనం పలు మార్లు తెరపైకి వచ్చింది. భారత్కు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa