కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో శుక్రవారం డ్రోన్ కెమెరా కలకలం రేపింది. తిరుమలలోని శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగరవేశారు. అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకుని వచ్చి ఇద్దరు డ్రోన్ ఎగరవేయడం కలకలం రేపింది. భక్తులు, భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ డ్రోన్ ఎగరేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని గమనించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించగా.. వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. డ్రోన్ ఎగరేసిన్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలాగే డ్రోన్ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం..
డ్రోన్ సంచారం.. స్పందించిన టీటీడీ
మరోవైపు తిరుమల శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగరేయటంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. శిలాతోరణం ఫారెస్ట్ ఏరియాలో ఇస్కాన్ భక్తులు సులక్షణ దాస్ ,అర్జున్ దాస్ డ్రోన్లతో విజువల్స్ తీస్తుండడాన్ని ఫారెస్ట్, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించినట్లు తెలిపింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించింది. పోలీసులు వారిని విచారిస్తున్నారంటూ టీటీడీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్, జనవరి నెలలలో తిరుమల శ్రీవారి ఆలయాల్లో పలు పర్వదినాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 23వ తేదీన తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినం ముందురోజు డిసెంబర్ 29వ తేదీ కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.
వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్న డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకూ కూడా ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. అలాగే రథసప్తమి సందర్భంగా జనవరి 25న కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అయితే ఈ రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రం దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు నేపథ్యంలో ఆయా రోజులకు ముందు రోజు సిఫార్సు లేఖలను కూడా స్వీకరించడం లేదని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa