ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ ప్లేయర్‌గా జస్టిన్ గ్రీవ్స్ రికార్డు

sports |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 08:45 PM

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఎవ్వరూ ఊహించని విధంగా ఆడింది. ముఖ్యంగా జస్టిన్ గ్రీవ్స్ ఆటతీరుకు క్రికెట్ లోకం ఫిదా అయింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మొదటి టెస్టులో 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎదుర్కొన్న కరీబియన్లు 163 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రా చేసేశారు. ఈ చారిత్రాత్మక డ్రాలో జస్టిన్ గ్రీవ్స్ హీరోగా నిలిచాడు.


గ్రీవ్స్ 388 బంతులు ఆడి 202 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో లేదా అంతకన్నా కింద బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లలో డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా గ్రీవ్స్ నిలిచాడు. ప్రపంచంలోనే ఈ రికార్డు నెలకొల్పిన మొదటి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో లార్డ్స్ వేదికగా 2023లో జరిగిన టెస్టులో బెన్ స్టోక్స్ 155 పరుగులతో గతంలో ఈ లిస్ట్‌లో ఉన్నాడు.


విండీస్ స్టార్ బ్యాటర్ షై హోప్ 140 పరుగులతో అద్భుతంగా ఆడి ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. ఐదో రోజు ప్రారంభంలోనే హోప్ అవుట్ అయినా, గ్రీవ్స్ మాత్రం ఆఖరి వరకూ నిలబడ్డాడు. అతనికి కిమారీ రోచ్ సహకరించాడు. రోచ్ కూడా 233 బంతులు ఆడి 58 పరుగులు చేశాడు.


న్యూజిలాండ్ - వెస్టిండీస్ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఎక్స్‌ వేదికగా విండీస్‌ను ఆకాశానికి ఎత్తాడు. “37కి ఆలౌట్ అయ్యే టీమ్.. గబ్బాలో పింక్ బాల్ టెస్ట్ గెలుస్తుంది.. లీడ్స్‌లో 320 ఛేజ్ చేస్తుంది, ఇప్పుడు 530ని తట్టుకుని మ్యాచ్‌ను కాపాడుతుంది. వీళ్లంతా ఎప్పటికప్పుడు షాక్ ఇచ్చే టాలెంటెడ్ నేషన్” అంటూ రాసుకొచ్చాడు.


నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ పొజిషన్‌ వారిగా హయ్యెస్ట్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీళ్లే 1. సునీల్ గవాస్కర్ 221, 2. జో డార్లింగ్ 160, 3. జార్జ్ హెడ్‌లీ 223, 4. బాబర్ ఆజామ్ 196. 5. నాథన్ అస్టెల్ 222, 6. జస్టిన్ గ్రీవ్స్ 202 (నాటౌట్), 7. ఆడమ్ గిల్‌క్రిష్ట్ 149 నాటౌట్, 8. డేనియల్ వెటోరి 140, 9. మిచెల్ జాన్సన్ 61, 10. టిమ్ సౌథీ 77, 11. షేన్ షిల్లింగ్ఫోర్డ్ 53 (నాటౌట్).


నాలుగో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన అరుదైన జాబితాలో కూడా ఇప్పుడు గ్రీవ్స్ నిలిచాడు. హెడ్‌లీ (1930), ఎడ్రిచ్ (1939), గవాస్కర్ (1979), గ్రీనిడ్జ్ (1984), అస్టెల్ (2002), కైల్ మేయర్స్ (2021) తర్వాత ఇప్పుడు గ్రీవ్స్ 2025లో చేరాడు. 500కు పైగా టార్గెట్ ఇచ్చి కూడా డ్రా అయిన మూడో టెస్ట్ ఇదే. 1946లో ఎంసీజీ వేదికగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మ్యాచ్ మొదటిసారి డ్రా అయింది. 2021లో కరాచీ వేదికగా జరిగిన పాకిస్తాన్ - ఆస్ట్రేలియా, ఆ తర్వాత 2025లో ఇప్పుడే వెస్టిండీస్ - న్యూజిలాండ్ మ్యాచ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa