ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి నుంచి మదనపల్లె జిల్లాలో పాలన స్టార్ట్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 09:28 PM

ఏపీలో పాలనా వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించే లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. కొత్త జిల్లాలకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మదనపల్లె కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన జిల్లాలో.. 2026 జనవరి 1 పరిపాలన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.


అక్కడే జిల్లా కలెక్టరేట్..


కొత్త జిల్లాలో పారిపాలనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు అందినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు ఎంపిక చేయడంపై కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ దృష్టి సారించారు. ఇప్పటికే మదనపల్లెలో ఉన్న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని.. నూతన జిల్లా కలెక్టర్‌ కార్యాలయంగా ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన డీఎల్‌డీవో కార్యాలయంలో.. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇక ఇతర విభాగాల కార్యాలయాల కోసం కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.


మదనపల్లెలోని బీటీ కాలేజీలో కొన్ని విభాగాలను, జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలికంగా వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఇవి సరిపోకపోతే.. ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పరిపాలనకు సంబంధించి దాదాపు 60 విభాగాలుంటాయి. వీటికి తాత్కాలిక కార్యాలయాలు అవసరం. అయితే అందులో 50 శాతం కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయొచ్చనే అభిప్రాయానికి వచ్చారు అధికారులు. మిగతా కార్యాలయాలను.. ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.


మరికొన్ని రోజుల్లో కార్యాలయాలను ఎంపిక చేసి.. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆఫీస్ ఏర్పాటుకు భవనం ఇంకా దొరకలేదని తెలుస్తోంది. జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలు కొత్త జిల్లాలోని బీటీ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలతో మదనపల్లె జిల్లా ఏర్పాటు అయింది. మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లు ఈ కొత్త జిల్లాలో ఉన్నాయి. కాగా, పుంగనూరు నియోజకవర్గంలో రొంపిచెర్ల మండలం మదనపల్లె జిల్లాలో ఉండనుంది. కానీ చిత్తూరు రెవెన్యూ డివిజన్‌ కిందికి వస్తోంది. గెజిట్‌ నోటిఫికేషన్‌లో కూడా ఇలాగే ఉంది. అందుకే ఆ మండలాన్ని పీలేరు రెవెన్యూ డివిజన్‌లో చేర్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa