కూటమి ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ దిశగా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రిగా ఆయన పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన 'పల్లె పండుగ 1.0' పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంపై కలెక్టర్లకు అభినందనలు. ఈ కార్యక్రమం కింద గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, రైతులకు అండగా 22,500 మినీ గోకులాలు, 15,000 నీటి తొట్టెలు, 1.2 లక్షల ఫామ్ పాండ్స్ను విజయవంతంగా నిర్మించాం" అని తెలిపారు.ఉపాధి హామీ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించి, రూ.4,330 కోట్ల వేతనాలు చెల్లించామని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో చేయూతనిచ్చిందని వివరించారు.మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన 'అడవి తల్లి బాట' కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అటవీ అనుమతుల విషయంలో పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల కలెక్టర్లు అద్భుతమైన పనితీరు కనబరిచారని అభినందించారు. ముఖ్యంగా, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ 100 శాతం అనుమతులు సాధించడంపై ప్రశంసలు కురిపించారు.పంచాయతీరాజ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే 'రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్' (RGSA)లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. గ్రామ పంచాయతీల ఆదాయ వనరులను పెంచేందుకు పన్నుల వసూళ్లను డిజిటలైజ్ చేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జూన్లో ఒక యూనిట్తో ప్రారంభమైన 'స్వచ్ఛ రథం' కార్యక్రమం నేడు 25 యూనిట్లకు చేరి సత్ఫలితాలనిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్లకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa