ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఒమన్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ చెవికి ఒక రింగ్ లాంటి పరికరం కనిపించింది. దీంతో అసలు అది ఏంటి అని నెటిజన్లు.. సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది ప్రధాని మోదీ.. ఒక కొత్త వస్తువును తన చెవికి పెట్టుకోవడంపై ఆరా తీస్తున్నారు. అయితే అది ఒక ట్రాన్స్లేషన్ పరికరం అని తేలింది. అంటే ప్రధాని మోదీతో మాట్లాడేవారు ఏ భాష మాట్లాడినా అది ఆయనకు అర్థం అయ్యే భాషలో వినిపించే పరికరం. అది ఒక రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ ఇయర్పీస్ అని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఒమన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి అధికారులు, దౌత్యవేత్తలు, ఇతర నేతలతో అరబిక్ భాషలో జరిపే దౌత్య సంభాషణలను వెంటనే అర్థం చేసుకునేందుకు ఈ డివైజ్ ఉపయోగపడింది. ఈ పర్యటనలో భారత్-ఒమన్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదరడంతో పాటు.. నరేంద్ర మోదీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.
ప్రధాని నరేంద్ర మోదీ, ఒమన్ ఉప ప్రధానమంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్తో సమావేశం అయినపుడు ఈ ట్రాన్స్లేషన్ డివైజ్ స్పష్టంగా కనిపించింది. ఒమన్ దేశ అధికార భాష అరబిక్. దౌత్యపరమైన చర్చల్లో అవతలి వ్యక్తి మాట్లాడే మాటలను విని.. అదే సమయంలో క్షణాల్లో అనువదించి వినిపించడానికి ఈ టెక్నాలజీ డివైజ్ను ఉపయోగిస్తారు.
సాధారణంగా అంతర్జాతీయ వేదికలపై ట్రాన్స్లేటర్లు ఉంటారు. వాళ్లు ఒక నేత మాట్లాడిన మాటలను విని.. అవతలి నేతకు వారి భాషలో సారాంశాన్ని చెప్తారు. అయితే ఇలాంటి చిన్న పరికరాల వల్ల వారిద్దరి మధ్య జరిగే సంభాషణలు మరింత సహజంగా, వేగంగా సాగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. వస్త్రధారణ విషయంలో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపే ప్రధాని మోదీ.. ఇలా టెక్నాలజీని కూడా వినియోగిస్తూ.. ఎప్పుడూ స్పెషల్గా కనిపిస్తారు. అందుకే ఈ ట్రాన్స్లేటర్ డివైజ్ కూడా ఆయన ఫ్యాషన్ స్టేట్మెంట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక మోదీ పర్యటనలో భాగంగా భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనివల్ల దాదాపు 98 శాతం భారతీయ ఉత్పత్తులకు ఒమన్లో ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతులు చేసుకుంటారు. అదే సమయంలో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్.. ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ద ఆర్డర్ ఆఫ్ ఒమన్ను ప్రదానం చేశారు. ఇది ప్రధాని మోదీ అందుకున్న 29వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం. భారత్-ఒమన్ దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ పర్యటన మరింత ప్రాధాన్యం సాధించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa