బంగారం ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. సోమవారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు పరుగులు పెట్టాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ ధర 1.21 శాతం పెరిగి రూ.1,35,824 వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,383.73 డాలర్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు, డాలర్ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 67 శాతం పెరిగింది. 1979 తర్వాత ఒకే సంవత్సరంలో పసిడి ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతోంది.బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,13,999కి చేరి రికార్డు సృష్టించింది. అయితే, ఢిల్లీ స్పాట్ మార్కెట్లో మాత్రం లాభాల స్వీకరణ కారణంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa