ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.7 కోట్లతో 51 మహీంద్రా థార్ కార్లు.., అవినీతి ఆరోపణలు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 10:04 PM

ఒడిశా అటవీ శాఖ.. వన్యప్రాణుల పర్యవేక్షణ కోసం కొనుగోలు చేసిన 51 మహీంద్రా థార్ ఎస్‌యూవీల వ్యవహారం ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వాహనాల కొనుగోలుకు రూ. 7.1 కోట్లు ఖర్చు చేయగా.. వాటిని కస్టమైజ్ (మార్పులు) చేయడానికి అదనంగా మరో రూ. 5 కోట్లు వెచ్చించడంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఒడిశా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా ఆదేశాలు జారీ చేశారు. అకౌంటెంట్ జనరల్ నేతృత్వంలోని ప్రత్యేక ఆడిట్ బృందం ఈ మొత్తం ప్రక్రియపై ఆరా తీయనుంది.


గతేడాది నవంబర్‌లో అటవీ శాఖ ఒక్కో వాహనాన్ని సుమారు రూ. 14 లక్షల చొప్పున 51 థార్ వాహనాలను కొనుగోలు చేసింది. అడవుల్లో పెట్రోలింగ్, వేటగాళ్లను పట్టుకోవడం, కార్చిచ్చు నియంత్రణ కోసం ఈ వాహనాలను కేటాయించారు. అయితే.. ఈ థార్ వాహనాలను అడవుల్లో ప్రయాణించేందుకు అనుగుణంగా మార్చడానికి ఒక్కో వాహనంపై అదనంగా రూ. 9 లక్షల చొప్పున మొత్తం రూ. 5 కోట్లు ఖర్చు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అంటే థార్ కారు మొత్తం ధరలో దాదాపు 65 శాతం కేవలం మాడిఫికేషన్, ఎక్స్‌ట్రా ఫిట్టింగ్‌లకే ఖర్చు చేశారు అని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి.


అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. అడవుల్లో ఆఫ్ రోడింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి ఒక్కో వాహనానికి సుమారు 21 రకాల కొత్త హంగులను జోడించారు. ముందు, వెనుక భాగంలో గట్టి మెటల్ బంపర్లను అమర్చారు. నీటిలో ప్రయాణించేటప్పుడు ఇంజిన్‌లోకి నీరు చేరకుండా ఉండేందుకు స్నోర్కెల్స్‌ను ఏర్పాటు చేశారు. సాధారణ అలాయ్ వీల్స్ కంటే ధృడంగా ఉండేందుకు స్టీల్ వీల్స్‌ను అమర్చారు. రూఫ్ రాక్స్, హెల్లా ఆక్సిలరీ లైట్లు, ట్రాక్షన్ ప్యాడ్స్, ప్రత్యేక బాడీ రాపింగ్ వంటివి ఉన్నాయి.


మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా ఆదేశాల మేరకు ప్రత్యేక ఆడిట్ బృందం పలు అంశాలపై దృష్టి సారించనుంది. అయితే ఇంత మొత్తంలో భారీగా ఖర్చు చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నారా లేదా అనేది విచారణ జరపనున్నారు. ఈ కస్టమైజేషన్ కోసం అనుసరించిన టెండర్ ప్రక్రియ సక్రమంగా ఉందా లేదా అనేది తేల్చనున్నారు. ఆ కార్లకు అమర్చిన పరికరాలు నిజంగానే అటవీ పర్యవేక్షణకు అవసరమా లేదా.. ఈ ప్రక్రియలో ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీలకు లబ్ధి చేకూరిందా అనేది గుర్తించనున్నారు.


ఈ కార్ల వ్యవహారంలో ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి ఖుంటియా స్పందించారు. ఫీల్డ్ ఆఫీసర్ల విజ్ఞప్తి మేరకే ఈ మార్పులు చేసినట్లు ప్రాథమికంగా తెలిసినా.. ఖర్చు భారీగా ఉన్నట్లు తేలితే మాత్రం ఎవరినీ వదిలిపెట్టమని తీవ్ర హెచ్చరికలు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వాహనాల్లో 9 థార్లను వేటగాళ్ల ముప్పు ఎక్కువగా ఉన్న సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో మోహరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa