ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు సూచన

national |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 09:30 PM

సోషల్ మీడియా వినియోగంపై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక సూచనలు చేసింది. ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్న తరహాలోనే, 16 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించేలా చట్టం తీసుకురావాలనే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.ఎస్. విజయ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం  జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల చిన్నారుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని పిటిషనర్ తన వాదన వినిపించారు. చిన్నారులు ఇలాంటి కంటెంట్ చూడకుండా నిరోధించేలా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయాలని కోరారు.పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, అశ్లీల కంటెంట్‌ను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అయితే, ఇది కేవలం ఒక సూచన మాత్రమేనని, కచ్చితమైన ఆదేశం కాదని స్పష్టం చేసింది. అంతకంటే ముందుగా 16 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియాకు పూర్తిగా దూరం చేసేలా చట్టం తీసుకురావడంపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచించింది. అలాంటి చట్టం అమల్లోకి వచ్చేలోపు, ఈ అంశంపై చిన్నారులు, వారి తల్లిదండ్రుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, బాలల హక్కుల కమిషన్‌లను ఆదేశించింది.ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఖాతాలు తెరవడాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తారు. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు ఈ తరహా చట్టాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించడం గమనార్హం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa