ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 4,300 కోట్లకు ,,,,ఎయిర్‌లైన్స్‌ను విక్రయించిన పాకిస్తాన్

international |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 10:07 PM

పాకిస్తాన్ ‌ జాతీయ విమానయాన సంస్థ.. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ప్రైవేటీకరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పెట్టిన కఠిన నిబంధనల మేరకు.. భారీ నష్టాల్లో కూరుకుపోయి ఉన్న ఈ విమానయాన సంస్థను పాకిస్తాన్‌ ప్రభుత్వం వేలం వేసింది. దీంతో పాకిస్తాన్‌లోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన పీఐఏ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌లో జరిగిన అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రక్రియ ఇదే కావడం గమనార్హం. ఆరిఫ్ హబీబ్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచి.. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను దక్కించుకుంది.


బిడ్డింగ్ వివరాలు, ధర


ఈ పీఐఏ విక్రయం కోసం జరిగిన వేలంలో 3 ప్రధాన సంస్థలు పోటీ పడ్డాయి. పారదర్శకత కోసం ఈ బిడ్డింగ్ ప్రక్రియను టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేశారు. ఆరిఫ్ హబీబ్ గ్రూప్ 13,500 కోట్ల పాకిస్థానీ రూపాయలకు (సుమారు రూ. 4,320 కోట్లు) బిడ్‌ను దక్కించుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఎయిర్‌లైన్ కనీస ధరను 1,000 కోట్ల పాకిస్థానీ రూపాయలుగా (సుమారు రూ. 3,200 కోట్లు) నిర్ణయించింది. లక్కీ సిమెంట్ గ్రూప్ 13,400 కోట్ల రూపాయల వరకు పోటీ పడి మరీ బిడ్డింగ్ వేసి చివరికి వెనక్కి తగ్గింది. మరో సంస్థ ఎయిర్‌బ్లూ కేవలం 2,650 కోట్ల రూపాయలకే బిడ్ వేసి రేసు నుంచి తప్పుకుంది.


ఈ ఒప్పందం కేవలం విక్రయానికి మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్తాన్ ఎయిర్‌లైన్ పునరుద్ధరణకు మరికొన్ని షరతులను కూడా విధించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం 75 శాతం వాటాను మాత్రమే విక్రయించింది. మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం 90 రోజుల పాటు కొనుగోలుదారుకు కల్పించారు. పీఐఏను కొనుగోలు చేసిన సంస్థ.. రాబోయే 5 ఏళ్లలో ఎయిర్‌లైన్ అభివృద్ధి కోసం రూ. 2,560 కోట్లు (8 వేల కోట్ల పాకిస్థానీ రూపాయలు) అదనంగా పెట్టుబడి పెట్టాలని షరతు పెట్టారు. ఇక పీఐఏను విక్రయించగా వచ్చిన సొమ్ములో 92.5 శాతాన్ని తిరిగి ఎయిర్‌లైన్ అప్పులు తీర్చడానికి.. విమానాల మరమ్మతులకు కేటాయించనున్నారు. కేవలం 7.5 శాతం మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.


గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. గతేడాది పీఐఏ అప్పులు సుమారు రూ. 20,928 కోట్ల (65,400 కోట్ల పాకిస్థానీ రూపాయలు)లకు చేరుకున్నాయి. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు 7 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఐఎంఎఫ్ పెట్టిన ప్రధాన నిబంధనల్లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కీలకంగా ఉంది. పైలట్ల లైసెన్సుల కుంభకోణం, విమానాల నాణ్యత తగ్గడం వంటి కారణాలతో అంతర్జాతీయంగా పీఐఏ ప్రతిష్ట ఘోరంగా దెబ్బతింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa