‘ఎవరి తీసిన గోతిలో వాళ్లే పడతారు’ అన్న సామెత పాకిస్థాన్కు సరిగ్గా వర్తిస్తుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది అంతర్గత భద్రతకు అదే పెను ముప్పుగా మారింది. అఫ్గనిస్థాన్ను తాలిబన్లు తిరిగి హస్తగతం చేసుకున్నప్పటి నుంచి తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువైంది. అఫ్గన్ సరిహద్దుల్లో పాక్కు వీళ్లు సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా ఖైబర్ పఖుంఖ్వా ప్రావిన్సుల్లో పాక్ ఆర్మీపై తరుచూ దాడులు చేస్తూ వారికి కంటిమీద కనుకులేకుండా చేస్తున్నారు. అయితే, ఈ ఉగ్ర సంస్థ వచ్చే ఏడాదిలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు వ్యూహరచన చేసింది.
ఇందులో భాగంగానే వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ సిద్ధమైనట్టు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సంచలనంగా మారాయి. ఇది పాక్ సైన్యాన్ని మరింత కలవరానికి గురిచేస్తోంది. 2026లో ఏర్పాటుచేసే వైమానిక దళానికి సలీం హక్కానీ నాయకత్వం వహిస్తారని వెల్లడించింది. దీంతో పాటు ప్రావిన్సుల వారీగా మోహరింపులు, సైనిక విభాగాలు సైతం ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అంతేకాదు, కమాండర్లతో కూడిన రెండు కొత్త పర్యవేక్షణ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. వీటి ద్వారా కశ్మీర్, గిల్గిత్- బాల్టిస్థాన్ సహా పలు ప్రావిన్సులను తమ ఆధీనంలోకి తీసుకోవాలని టీటీపీ ప్లాన్ చేస్తోంది.
అలాగే, మిలిటరీ యూనిట్లలో నాయకత్వ మార్పులు సైతం చేపట్టింది. బలూచిస్థాన్ను కవర్ చేసే పశ్చిమ జోన్, సెంట్రల్ జోన్లకు ఒక్కో సైన్యాధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు. కాగా, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉద్దేశాన్ని ఒక తీవ్రమైన చర్యగా భద్రతా సంస్థలు పరిగణిస్తున్నాయి. నవంబరు 2022లో పాకిస్థాన్ ప్రభుత్వంతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు పలికిన తర్వాత నుంచి పాక్ సైన్యం, పోలీసులు, అధికారులపై వరుస దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్స్లలో తన కార్యకలాపాలు విస్తరించింది. అఫ్గన్ భూభాగం నుంచి టీటీపీ దాడులకు తెగబడుతోందని పాక్ ఆరోపిస్తోంది. కానీ, తాలిబన్ ప్రభుత్వం ఆరోపణలను తోసిపుచ్చుతోంది. గత ఏడాది కాలంగా 600పైగా దాడులను టీటీపీ నిర్వహించింది.
ఇదిలా ఉండగా, అఫ్గనిస్థాన్పై ఇటీవల పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో టీటీపీ చీఫ్ నూర్ వలీ మెహసూద్ను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అయితే తాను సురక్షితంగా ఉన్నట్టు దాడుల తర్వాత నూర్ ప్రకటించారు. కానీ, ఈ దాడుల్లో తన కుమారుడు చనిపోయినట్టు ఆయన ధ్రువీకరించారు. భారత్, అఫ్గనిస్థాన్ మధ్య సంబంధాలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశంలో దాడుల వెనుక న్యూఢిల్లీ ఉందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa