ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా, రష్యా, ఇరాన్‌తో సంబంధాలు తెంచుకోవాలని..: వెనుజులాకు ట్రంప్ వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 09:26 PM

వెనుజులా కొత్త ప్రభుత్వంపై షరతులతో కూడిన ఒప్పందాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకుని, తమను మరింత చమురు ఉత్పత్తికి అనుమతిస్తేనే, వెనిజులాకు సహాయం చేస్తామని ట్రంప్ యంత్రాంగం హెచ్చరిస్తోందది. అంతేకాదు చమురు ఉత్పత్తిలో అమెరికాతోనే భాగస్వామ్యం కుదుర్చుకోవాలని, భారీ ముడి చమురు అమ్మకాల్లో అమెరికాకే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ట్రంప్ కోరుతున్నట్లు ఏబీసీ న్యూస్ నివేదించింది.


 గతవారం అమెరికా సైనిక ఆపరేసన్ అనంతరం, వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుని, దేశ నుంచి తరలించారు. దీంతో వెనుజులాలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఈ షరతులు విధించింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే, దేశాన్ని తానే నియంత్రిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు.


వెనుజులా చమురు వెలికితీయాలంటే, ట్రంప్ విధించిన షరతులను పాటించాలని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటిది చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలను దేశం నుంచి బహిష్కరించి, వారితో ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలి. రెండోది చమురు ఉత్పత్తిలో అమెరికాతోనే భాగస్వామ్యం కుదుర్చుకోవాలి. భారీ ముడి చమురు అమ్మకాల్లో అమెరికాకే ప్రాధాన్యత ఇవ్వాలి.


చైనా చాలా కాలంగా వెనిజులాకు సన్నిహితంగా ఉంది. వెనిజులా చమురును ఎక్కువగా కొనుగోలు చేసేది కూడా చైనాయే. అమెరికా ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడానికి కారణం వెనిజులా వద్ద ఉన్న చమురు ట్యాంకర్లు అన్నీ నిండిపోయాయని, కొత్తగా ఉత్పత్తి చేసే చమురును నిల్వ చేయడానికి స్థలం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చట్టసభ సభ్యులకు ప్రైవేటుగా వివరించినట్లు సమాచారం.


డిసెంబర్ చివరి నుంచి వెనుజులా చమురు బావులను మూసివేయడం ప్రారంభించింది. అమెరికా దిగ్బంధనం వల్ల ఉత్పత్తి అయిన చమురును నిల్వ చేయడానికి స్థలం లేకపోవడమే దీనికి కారణం. ఇలా మరిన్ని బావులను మూసివేస్తే, వెనిజులా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టమవుతుంది. అలాగే, రోడ్రిగ్జ్ అధికారానికి కూడా ముప్పు వాటిల్లుతుంది.


అమెరికా అంచనాల ప్రకారం.. వెనిజులా తన చమురు నిల్వలను అమ్మకుండా మరికొన్ని వారాలు మాత్రమే ఆర్థికంగా నిలబడగలదు. అమెరికా ఈ చమురును నియంత్రించడం ద్వారానే తన ప్రణాళికను అమలు చేయాలని భావిస్తోంది. అమెరికా దళాలను పంపాల్సిన అవసరం ఉండదని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ రోజర్ విక్కర్ తెలిపారు. ‘ప్రభుత్వం చమురును నియంత్రించాలని యోచిస్తోంది. ఓడలు, ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంటుంది. వాటిలో ఏదీ హవానాకు వెళ్లదు. అవి బహిరంగ మార్కెట్‌కు వెళ్లే వరకు, నింపడానికి ట్యాంకర్లు ఉండవు, ఎందుకంటే అవన్నీ పూర్తిగా నిండిపోయాయి’ అని విక్కర్ చెప్పారు.


ఈ నివేదికలపై వైట్ హౌస్ ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాకుండా వెనుజులాలోని తాత్కాలిక అధికారులు 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగిస్తారని, దానిని మార్కెట్ ధరకు అమ్ముతారని ట్రంప్ ప్రకటించారు. ‘ఆ నిధులను తానే నియంత్రిస్తానని, వెనుజులా ప్రజలు, అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా వాటిని ఉపయోగిస్తాను’ ట్రంప్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa