BCCI: ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ 2026 నుంచి తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), బీసీసీఐ (BCCI) మధ్య సంబంధాలు మరింత దిగజారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2026 టీ20 వరల్డ్ కప్ను భారత్లో ఆడేందుకు బీసీబీ ఆసక్తి చూపడం లేదన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.ఇదే సమయంలో వేదికల మార్పుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుండగా, బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇవి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు గట్టి షాక్గా భావిస్తున్నారు.వేదికల మార్పుపై బీసీసీఐ స్పష్టత ఈ అంశంపై బీసీబీ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఐఏఎన్ఎస్తో మాట్లాడిన బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు.బంగ్లాదేశ్ మ్యాచ్లను చెన్నై లేదా ఇతర ప్రాంతాలకు మార్చాలన్న అంశంపై బీసీసీఐకి ఎలాంటి సమాచారం అందలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం పూర్తిగా బీసీబీ, ఐసీసీ (ICC) పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఐసీసీయే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాబట్టి, వేదికల మార్పుపై తుది నిర్ణయం కూడా అదే తీసుకుంటుందని చెప్పారు. ఐసీసీ నుంచి అధికారిక ఆదేశాలు వస్తే మాత్రమే హోస్ట్ దేశంగా బీసీసీఐ అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే అలాంటి నిర్ణయం ఏదీ తమకు తెలియదని స్పష్టం చేశారు.బీసీబీకి ఎదురుదెబ్బ భారత్లో తమ జట్టుకు భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ, అక్కడ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కొంతకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ మ్యాచ్లకు తాము ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమని ఐసీసీకి ఆఫర్ చేయడం గమనార్హం.భారత్తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్న వేళ, పాకిస్థాన్ చేసిన ఈ ప్రకటన క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనం పాటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa