కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటన మరోసారి రాజకీయ దుమారానికి తెరలేపింది. ఆయన విదేశీ పర్యటనలపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సిన సమయంలో రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, పదేపదే విదేశాలకు వెళ్లడం ఆయన సీరియస్నెస్ను ప్రశ్నిస్తోందని కమలనాథులు వాదిస్తున్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ పర్యటనపై స్పందిస్తూ రాహుల్ గాంధీని 'పర్యాటక నాయకుడు' (టూరిస్ట్ లీడర్) గా అభివర్ణించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ సెలవుల మూడ్లోనే ఉంటారని, జాతీయ స్థాయిలో ముఖ్యమైన సమస్యలు ఎదురైనప్పుడు ఆయన విదేశాల్లో గడపడం అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలపై పోరాడటం కంటే విదేశీ విహారయాత్రలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని పూనావాలా విమర్శించారు.
రాహుల్ గాంధీ రాజకీయ పరిణతిపై కూడా బీజేపీ ఈ సందర్భంగా ప్రశ్నలు సంధించింది. ఆయన ఒక అపరిపక్వ నాయకుడని, దేశ ప్రజల పట్ల ఆయనకు కనీస బాధ్యత లేదని పూనావాలా మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించడంలో ఆయన విఫలమవుతున్నారని, ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం సన్నగిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. కేవలం ఫోటో షూట్ల కోసం, వ్యక్తిగత పర్యటనల కోసమే ఆయన సమయాన్ని కేటాయిస్తున్నారని విమర్శించారు.
అయితే, రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ గానీ, ఇటు రాహుల్ గాంధీ వ్యక్తిగత బృందం గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ పర్యటన వ్యక్తిగతమైనదా లేదా ఏదైనా అధికారిక కార్యక్రమమా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. విపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ పర్యటనపై మౌనం వహిస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రాజకీయంగా మరిన్ని చర్చలకు దారితీసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa