ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య రాముడికి బంగారు ధనుస్సు.. 286 కిలోల బరువు.. రూ.1.10 కోట్లతో తయారీ

national |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 10:17 PM

హిందువుల 500 ఏళ్ల నాటి కలను నెరవేర్చుతూ.. 2024 జనవరి 22వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ.. అత్యంత వైభవోపేతంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలె అయోధ్య రామాలయ నిర్మాణ పనులు పూర్తి కాగా.. అందుకు గుర్తుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. జెండాను ఎగురవేశారు. ఇక.. అయోధ్యలో నిర్మించిన బాలరాముడి ఆలయం ప్రాణప్రతిష్ఠ జరుపుకుని.. ఈనెల 22వ తేదీకి 2 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా.. అయోధ్య బాలరాముడికి ఒక అరుదైన కానుకను సమర్పించనున్నారు. ఒడిశాలో తయారైన 286 కిలోల భారీ స్వర్ణ ధనుస్సు.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి చేరుకుంది.


రూ.1.10 కోట్ల విలువైన ఈ బంగారు ధనుస్సును జనవరి 22వ తేదీన అయోధ్యలో సమర్పించనున్నారు. జగన్నాథుడి ప్రతిమతో కూడిన ఈ అద్భుత కళాఖండం ప్రస్తుతం పూరీ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయోధ్య శ్రీరాముడికి భక్తిపూర్వక కానుకగా సమర్పించేందుకు సిద్ధమైన ఈ అత్యంత అద్భుతమైన స్వర్ణ ధనుస్సు.. తన పవిత్ర యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి జగన్నాథ క్షేత్రమైన పూరీకి చేరుకుంది. అయోధ్య రామమందిరానికి ఒడిశా ప్రజల భక్తికి చిహ్నంగా భారీగా వెండి, బంగారంతో తయారు చేసిన ధనుస్సు ఇది.


 ఒడిశాలోని రూర్కెలాలో తయారైన ఈ రామ్ ధను.. ఆ రాష్ట్రంలోని వివిధ జిల్లాల గుండా ప్రయాణించి ఆదివారం అర్థరాత్రి పూరీ క్షేత్రానికి చేరుకుంది. దీన్ని ప్రస్తుతం పూరీలోని ఉత్తరపార్శ్వ మఠంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ ధనుస్సు మొత్తం బరువు 286 కిలోలు కాగా.. దాన్ని తయారు చేయడానికి సుమారు రూ.1.10 కోట్లు ఖర్చు అయింది. ఆ ధనుస్సు తయారీలో 1 కిలో బంగారం.. 2.5 కిలోల వెండితో పాటు రాగి, జింక్, ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. ఈ రామ్ ధను.. 8 అడుగుల పొడవు.. 3 అడుగుల వెడల్పుతో గంభీరంగా ఉంటుంది.


పూరీ జగన్నాథుడు, అయోధ్య రాముడు ఆధ్యాత్మిక సంబంధానికి గుర్తుగా.. ఈ ధనుస్సుపై శ్రీ జగన్నాథ స్వామి విగ్రహాన్ని, ఫిలిగ్రీ కిరీటాన్ని అద్భుతంగా చెక్కారు. సోమవారం ఉదయం నుంచే ఉత్తర పార్శ్వ్ మఠం ప్రాంగణంలో భక్తుల భజనలు, కీర్తనలు, గోటిపువ నృత్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ స్వర్ణ ధనుస్సును జగన్నాథ ఆలయం (శ్రీమందిర్) చుట్టూ ప్రదక్షిణ చేయించారు.


జనవరి 22న సమర్పణ


పూరీ క్షేత్రంలో రామ్ ధనుకు చేయాల్సిన క్రతువులు పూర్తయిన తర్వాత.. పవిత్ర శోభాయాత్ర అయోధ్యకు బయలుదేరింది. సరిగ్గా జనవరి 22వ తేదీన ఈ స్వర్ణ ధనుస్సు అయోధ్య రామమందిరానికి చేరుకోనుంది. అక్కడ శ్రీరామచంద్రుడి పాదాల చెంత భక్తిపూర్వకంగా సమర్పించనున్నారు. ఈ మహత్కార్యాన్ని సనాతన జాగరణ మంచ్ నిర్వహిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa