ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది 'గ్రేట్ డీల్' కాదని, భారతదేశానికి ఇదొక 'బ్లాక్ డీల్' అని అభివర్ణించారు. ప్రధాని మోదీ తీరు 'నామ్ నరేందర్ కామ్ సరెండర్' అన్నట్లుగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. అగ్రరాజ్యం బ్లాక్ మెయిల్కు తలొగ్గి, ప్రధాని మోదీ దేశ ప్రజల ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టారని, ఆయన అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందం దేశ భవిష్యత్తుకే అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా ఉత్పత్తులపై సున్నా సుంకాలు విధించడం ద్వారా భారత మార్కెట్లను వారికి అప్పగించడం, మన స్వదేశీ పరిశ్రమలకు, రైతాంగానికి మరణశాసనం రాయడమేనని షర్మిల దుయ్యబట్టారు. మన దేశ ఎగుమతులపై అమెరికా 18 శాతం సుంకాలు తగ్గిస్తే, వారి దిగుమతులపై మోదీ గారు సుంకాలు సున్నా చేయడం ఏంటి మొన్నటిదాకా మన ఉత్పత్తులపై అమెరికా వేసిన పన్నులు 5 శాతం లోపే. ఇప్పుడు దాన్ని 50 శాతానికి పెంచి, అందులో 18 శాతం కుదిస్తే మనకు ప్రయోజనం ఎలా కలుగుతుంది దీనివల్ల భారత్కు దక్కే ప్రయోజనం కంటే, సున్నా సుంకాలతో అమెరికాకు 100 శాతం లాభం చేకూరుతుంది అని షర్మిల విమర్శించారు. ఇది భారత రైతుల మెడకు ఉరిపెట్టి, అమెరికా వ్యవసాయానికి మోదీ ఇచ్చిన గ్రేట్ డీల్ అని ఆమె మండిపడ్డారు.అధ్యక్షుడు ట్రంప్ కోసం ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి తిలోదకాలు ఇచ్చారని షర్మిల ఆరోపించారు.రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటే మళ్లీ సుంకాలు 50 శాతం పెంచుతామని ట్రంప్ బహిరంగంగా బెదిరిస్తుంటే ఇది బ్లాక్ మెయిల్ కాదా? ఆ భయంతోనే మోదీ సాగిలపడ్డారు అని ఆమె వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందాలు ఇరు దేశాల మధ్య సమతూకంగా ఉండాలి కానీ, ఒక దేశానికి నష్టం, మరో దేశానికి లాభం చేసేవాటిని ఒప్పందాలు అనరని అన్నారు. 75 ఏళ్ల భారత వాణిజ్య ఒప్పందాల చరిత్రను మోదీ తుంగలో తొక్కారని, 50 కోట్ల వ్యవసాయ ఆధారిత కుటుంబాల కన్నా అమెరికా ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమయ్యాయని విమర్శించారు. ఏటా 100 బిలియన్ డాలర్ల దేశ సంపదను అమెరికాకు అప్పనంగా కట్టబెట్టే కుట్రలో ఈ ఒప్పందం భాగమని ఆరోపించారు. భారత ప్రధాని విదేశం ఎదుట లొంగిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ వెంటనే ఈ 'సరెండర్ అగ్రిమెంట్' పూర్తి వివరాలను బయటపెట్టాలని, కేవలం రెండు మూడు వస్తువుల గురించి కాకుండా అమెరికా నుంచి దిగుమతి కాబోయే అన్ని ఉత్పత్తులు, వాటిపై విధించే పన్నుల వివరాలను జాతికి తెలియజేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa