ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 ప్రపంచకప్‌లో ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 09:15 PM

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఇటలీపై ఇంగ్లండ్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ సి నుంచి సూపర్ 8 దశకు అర్హత సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ బ్యాటర్లు బెన్ మనెంటీ, గ్రాంట్ స్టీవర్ట్‌లు అద్భుతంగా పోరాడినా, చివరికి ఇంగ్లండ్ అనుభవం ముందు నిలవలేకపోయారు.ఇంగ్లండ్ నిర్దేశించిన 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి 1 పరుగుకే 2 వికెట్ల కష్టాల్లో పడింది. కొద్దిసేపటికే మరో వికెట్ పడటంతో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఈ దశలో జస్టిన్ మోస్కా (43), బెన్ మనెంటీ (60) అద్భుతమైన భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.ముఖ్యంగా మనెంటీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఒక పూర్తిస్థాయి సభ్య దేశంపై అసోసియేట్ జట్టు బ్యాటర్ సాధించిన వేగవంతమైన అర్ధశతకం ఇదే. తన ఇన్నింగ్స్‌లో మనెంటీ 6 భారీ సిక్సర్లు, 4 ఫోర్లు బాదడంతో ఇంగ్లండ్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విల్ జాక్స్ విడదీశాడు. మనెంటీ ఔటయ్యాక ఇంగ్లండ్ బౌలర్లు సామ్ కరన్ (3/22), ఆదిల్ రషీద్‌లు వరుసగా వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు సాధించారు.అయితే, చివర్లో గ్రాంట్ స్టీవర్ట్ (23 బంతుల్లో 45) మరోసారి మెరుపులు మెరిపించడంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. స్టీవర్ట్ ఐదు సిక్సర్లతో విరుచుకుపడటంతో సమీకరణం 12 బంతుల్లో 30 పరుగులుగా మారింది. కానీ, కీలకమైన 19వ ఓవర్‌లో సామ్ కరన్.. స్టీవర్ట్‌ను ఔట్ చేయడంతో ఇటలీ ఆశలు ఆవిరయ్యాయి. చివరి ఓవర్‌లో జేమీ ఓవర్టన్ (3/18) మిగిలిన వికెట్లు తీయడంతో ఇటలీ 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. ఓడిపోయినప్పటికీ, ఇటలీ బ్యాటర్లు ఏకంగా 13 సిక్సర్లు కొట్టి తమ పోరాట పటిమతో అందరి ప్రశంసలు అందుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa