ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్‌తో మోదీ చారిత్రాత్మక రక్షణ ఒప్పందం,,,భారత్ చేతికి ఐరన్ డోమ్ సాంకేతికత

national |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 07:32 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు అపూర్వమైన స్థాయికి చేరుకున్నాయి. కేవలం ఆయుధాల క్రయవిక్రయాలకే పరిమితం కాకుండా వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగేలా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇరు దేశాధినేతలు ప్రకటించారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించాలన్న భారత్ లక్ష్యానికి.. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం తోడవబోతుండటం ఈ పర్యటనలో అత్యంత కీలకాంశంగా నిలిచింది.


కొనుగోలుదారు నుంచి తయారీదారుగా..


గతంలో భారత్ కేవలం ఆయుధాలను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసేది. అయితే తాజా ఒప్పందాల ప్రకారం రెండు దేశాలు కలిసి రక్షణ పరికరాలను అభివృద్ధి చేయడం, తయారు చేయడంపై దృష్టి సారించాయి. 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇది భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి పెద్దపీట వేయబోతుంది.


 భారత్ గగనతలానికి రక్షణ కవచం


ఈ పర్యటనలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం ఐరన్ డోమ్. శత్రువుల రాకెట్లు, క్షిపణులు, డ్రోన్‌లను గాలిలోనే గుర్తించి పేల్చివేసే ఈ వ్యవస్థను భారత్‌కు అందించేందుకు ఇజ్రాయెల్ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేవలం వ్యవస్థను కొనుగోలు చేయడం కాకుండా దాని సాంకేతికతను భారత్‌కు బదిలీ చేయడంపై చర్చలు జరుగుతున్నాయి. దీనిని భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మిషన్ సుదర్శన్ చక్ర మల్టీ-లేయర్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో విలీనం చేసే అవకాశం ఉంది. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ.. ఇది కార్యరూపం దాల్చితే భారత సరిహద్దు భద్రత మరింత పటిష్టం కానుంది.


భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను ముందుగానే పసిగట్టేందుకు 'హారిజన్ స్కానింగ్' అనే మెకానిజంపై ఇరు దేశాలు సహకరించుకోనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాలు, ఉమ్మడి పరిశోధనల ద్వారా ముప్పులను అంచనా వేయడం ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. రక్షణ రంగంలో వస్తున్న వినూత్న మార్పులకు అనుగుణంగా భారత సైన్యాన్ని సిద్ధం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.


పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య శాంతి నినాదం


పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సహించబోమని, శాంతి స్థాపనకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని మోదీ స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో పర్యటించిన మోదీ.. ఇరు దేశాల మధ్య ఉన్న అపూర్వ స్నేహాన్ని మరోసారి చాటిచెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa