చంద్రబాబు తన రాజకీయాల కోసం శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేశారని వైయస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబుకు సుప్రీం కోర్టు అంటే గౌరవం లేదు , సీబీఐ అంటే లెక్కలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతుంటే మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, మతం పేరుతో వైయస్ఆర్సీపీపై బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ అంశంపై వాస్తవాలు వెల్లడించేందుకు శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లడ్డూ ప్రసాదం అంశంపై తమ వాదనలను వివరించారు. రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చేసిన ప్రచారం తప్పుదోవ పట్టించే ప్రయత్నమని, సిట్, సీబీఐ నివేదికల్లో అలాంటి అంశాలు నిర్ధారణ కాలేదని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిట్ విచారణలో కూడా లడ్డూ తయారీలో జంతు కొవ్వు లేదని తేలిందన్నారు. గతంలో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి ఎలా తిరుమలకు వచ్చాయన్న విషయంపై ప్రశ్నలు లేవనెత్తారు. 2024 జూలైలో నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించగా, వాటిని శ్రీకాళహస్తి సమీపంలోని ప్రాంతంలో నిల్వ చేసి తరువాత లడ్డూ తయారీకి పంపారని ఆరోపణలు చేశారు. డెయిరీ కంపెనీల అనుబంధాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్ పాలనలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. తిరుమల సహా రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఆలయ ఘటనలను కూడా వారు ప్రస్తావించారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతలు, పుష్కరాల సమయంలో జరిగిన ప్రమాదాలు, భక్తుల భద్రతపై జరిగిన విమర్శలను గుర్తుచేశారు. రామతీర్థం ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆలయాల భద్రత, ప్రసాద నాణ్యతపై బాధ్యత తీసుకోవాలని సూచించారు. దేవాలయాలను రాజకీయ విమర్శలకు వేదిక చేయవద్దని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa