ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లకు చేరిన స్థూల జీఎస్‌టీ వసూళ్లు

national |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 08:34 PM

జీఎస్‌టీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో భారీగా నమోదయ్యాయి. 2026 ఫిబ్రవరి నెలకు గాను రూ.1.83 లక్షల కోట్ల స్థూల జీఎస్‌టీ వసూలైనట్లు కేంద్రం ఆదివారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు నెలతో పోలిస్తే ఇది 8.1 శాతం అధికం కావడం విశేషం.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఫిబ్రవరి 28 నాటికి మొత్తం స్థూల జీఎస్‌టీ ఆదాయం రూ.20.27 లక్షల కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది 8.3 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఇక ఫిబ్రవరిలో రూ.22,595 కోట్ల రీఫండ్లు చెల్లించారు. రీఫండ్లు సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.61 లక్షల కోట్లుగా నమోదైంది.దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం 5.3 శాతం వృద్ధితో రూ.1.36 లక్షల కోట్లుగా ఉండగా.. దిగుమతుల ద్వారా వచ్చిన రాబడిలో మాత్రం 17.2 శాతం భారీ వృద్ధి కనిపించింది. దిగుమతుల ద్వారా రూ.47,837 కోట్లు సమకూరాయి. అయితే, సెస్ వసూళ్లు మాత్రం ఆందోళనకరంగా తగ్గాయి. గతేడాది ఫిబ్రవరిలో రూ.13,481 కోట్లుగా ఉన్న నికర సెస్.ఈసారి రూ.5,063 కోట్లకు పడిపోయింది.రాష్ట్రాల వారీగా చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపించాయి. పారిశ్రామిక రాష్ట్రాల్లో వృద్ధి నమోదు కాగా, వనరుల ఆధారిత రాష్ట్రాల్లో వసూళ్లు తగ్గాయి. మహారాష్ట్ర రూ.10,286 కోట్ల వసూళ్లతో దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా... కర్ణాటక, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో సానుకూల వృద్ధి నమోదు కాగా.. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఆదాయం తగ్గింది.జీఎస్‌టీ 2.0 తర్వాత వసూళ్లు స్థిరంగా పెరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ బలంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దిగుమతుల రాబడి పెరగడం అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాల జోరును సూచిస్తోందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa