ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొత్త, కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. క్రమశిక్షణ, సమయపాలనను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు తప్పనిసరిగా చేరుకోవాలని స్పష్టం చేసింది. ఆ సమయం తర్వాత హాజరు నమోదు చేస్తే దానిని 'లేట్ ఇన్'గా పరిగణిస్తారు.కొత్త నిబంధనల ప్రకారం నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ (వెసులుబాటు సమయం) ఉంటుంది. ఇక హాఫ్-డే సెలవు తీసుకునే వారికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం విధులకు హాజరయ్యేవారు ఒంటి గంట లోపు హాజరు నమోదు చేయాలి. ఆ తర్వాత వస్తే 'లేట్ ఇన్'గా లెక్కిస్తారు. అలాగే ఉదయం విధులకు హాజరై మధ్యాహ్నం సెలవు పెట్టేవారు 12:30 గంటల కంటే ముందు 'ఔట్ టైమ్' నమోదు చేయకూడదు.పాఠశాల ముగిసే సమయానికి సంబంధించి కూడా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 3:30 గంటల కంటే ఒక్క నిమిషం ముందు ఔట్ టైమ్ నమోదు చేసినా, ఉన్నత పాఠశాలల టీచర్లు సాయంత్రం 4 గంటల కంటే ముందు నమోదు చేసినా దానిని 'ఎర్లీ ఔట్'గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉదయం ఇన్-టైమ్ నమోదు చేసి, సాయంత్రం ఔట్-టైమ్ నమోదు చేయడం మరిచిపోతే, వారు ఆ రోజంతా గైర్హాజరైనట్లే లెక్క. అంటే ఉదయం వచ్చిన వెంటనే వెళ్లిపోయినట్లుగా భావిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa